‘జగన్.. ఇచ్చిన హామీల అమలేది? సర్కారు కోతల వల్ల రైతులకు 24వేల కోట్ల నష్టం’
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తంలో రైతు రుణమాఫీ అవసరం లేదన్న జగన్.. ఇప్పుడు అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన తెలుగు రైతు వర్క్ షాప్లో లోకేష్ మాట్లాడారు.

జగన్.. ఇచ్చిన హామీల అమలేది?
రైతుకి విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తినే రోజులు తెచ్చారు. సున్నా వడ్డీకే రుణాలు అంటూ గతంలో లేని పథకంలా హడావిడి చేసి దొరికిపోయారు. సున్నా వడ్డీ దేవుడెరుగు అసలు రుణాలు ఇస్తే చాలు అనే పరిస్థితి వచ్చిందని జగన్ సర్కారుపై లోకేష్ విమర్శలు గుప్పించారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని జగన్ అన్నారు. పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం అని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలు బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల కోట్లు ఉన్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1000 కోట్లు వైకాపా ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది' అని అన్నారు లోకేష్.

జగన్ సర్కారు కోతల వల్ల రైతులకు 24వేల కోట్లు నష్టం
‘9 నెలల పాలనలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వర్షాలు బాగా పడినా ఫిబ్రవరి నెలలోనే తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఇక సాగునీరు ఎలా ఇస్తుంది. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా, కౌలు రైతులందరికీ పథకం వర్తిస్తుంది. ప్రతి రైతుకి 12,500 ఇస్తాం అన్నారు. ఇస్తుంది కేవలం 7,500 మాత్రమే. రాష్ట్రంలో ఉన్నది 80 లక్షల మంది రైతులు ఇచ్చింది సగం మంది రైతులకే. కేవలం 40 లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చి 45 లక్షల మంది రైతులను దగా చేసారు. అంతే కాదు ఇస్తా అన్న రూ. 12,500 లో 5 వేలు కోత పెట్టి 7,500 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా దశల వారీగా. ఏడాదికి 5 వేలు, అంటే ఐదేళ్లకు 25 వేలు నష్టపోతున్నారు. రాష్ట్రంలో 80లక్షల మంది రైతులు ఉన్నారు అంటే 24వేల కోట్లు నష్టపోతున్నారని జగన్ సర్కారను లోకేష్ దుయ్యబట్టారు.

ఆ హామీల ఊసేలేదు..
‘రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులు సుమారుగా 16 లక్షల మంది జగన్ రైతు భరోసా ఇచ్చింది కేవలం 59 వేల మందికి మాత్రమే. టిడిపి హయాంలో 70 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసారు. లక్షాయాభై వేల లోపు ఉన్న రుణాలు మూడు దఫాలుగా ఇస్తాం అని 50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని ఒకే సంతకంతో మాఫీ చేసారు. సుమారుగా రైతు రుణమాఫీ కోసం 24,500 కోట్లు ఖర్చు చేసింది టిడిపి ప్రభుత్వం. ప్రతి నియోజికవర్గంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నారు. ఇప్పుడు ఆ ఊసే లేదు' అని సీఎం జగన్పై లోకేష్ మండిపడ్డారు.

ఏడాదికి లక్ష లబ్ధి అన్నారు.. ఉన్నది కూడా లాక్కుంటున్నారు
12,500 రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు, సున్నా వడ్డీకే రుణాలు, ట్రాక్టర్ల మీద రోడ్డు ట్యాక్స్ ఎత్తేయడం కలిపి ఒక్కో రైతుకి ఏడాదికి లక్ష రూపాయిలు లబ్ది కలిగేలా చూస్తాం అని హామీ ఇచ్చి జగన్ గారు నిలువునా మోసం చేసారు. జగన్ దళిత ద్రోహి. అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన భూములు జగన్ బెదిరించి స్వాధీనపర్చుకుంటున్నారు. పేదవాళ్ల కోసం చంద్రబాబు నిర్మించిన ఇల్లు ఇవ్వకుండా పేదల భూములు లాక్కోవాలి అని జగన్ చూస్తున్నారు. 25 లక్షల ఇళ్ల స్థలాలు పెద్ద బోగస్. టీడీపీ హయాంలో కట్టిన 12 లక్షల ఇల్లు, చంద్రబాబు ఇచ్చిన ఐదు లక్షల ఇళ్ల పట్టాలు అన్ని కలిపి 25 లక్షల ఇళ్ల స్థలాలు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. తెలుగు రైతు విభాగం రైతులకు అండగా నిలవాలి. రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పై ఎప్పటికప్పుడు ఉద్యమించాలి. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం' అని లోకేష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications