భూదందా కోసమే వైజాగ్కు రాజధాని.. 30 రాజధానులు పెట్టుకోండి.. పవన్ సెన్సేషనల్ కామెంట్స్
''నా పేరు పవన్ కల్యాణ్.. ఇవాళ నేను చెప్పే విషయాన్ని అందరూ రాసిపెట్టుకోండి.. ఎందుకంటే రాష్ట్రంలో జరగబోయేది ఇదే.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నాం. బీజేపీతో కలిసి జనసేనే ఈ పని చేస్తుంది. జగన్ రెడ్డికి, ఆయన పార్టీలోని ప్రతిఒక్కడికీ బాగా మదమెక్కి కొట్టుకుంటున్నారు.. వికేంద్రీకరణ బిల్లుతోనే వాళ్ల వినాశనం మొదలైంది.. మళ్లీ ఎన్నికలు జరిగితే వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తా.. ఎవడేమనుకున్నా నాకు పట్టింపులేదు...''అంటూ తీవ్రస్థాయి ఆవేశంతో ఊగిపోయారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.

30 రాజధానులైనా పెట్టుకోండి..
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం అమరావతి రైతులతో పవన్ పమావేశమయ్యారు. గత నెల రోజులుగా రైతులు, మహిళలపై ప్రభుత్వం, పోలీసులు సాగిస్తోన్న దమనకాండను ఆయన ఖండించారు. భూగోళం బద్దలైనాసరే.. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జగన్ మూడు కాకుంటే 30 రాజధానులు పెట్టుకున్నా.. జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అన్నింటినీ కట్టగలిపి మళ్లీ అమరావతికి తీసుకొస్తానని, ఇది ప్రజలకు తాను చేస్తున్న వాగ్ధానమని పవన్ అన్నారు.

అప్పటిదాకా నిద్రపోను..
రైతులతో పవన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘మహిళలు, దివ్యాంగులు, రైతులపై జరిగిన పాశవికదాడులు చూసి నా గుండెలు పగిలిపోయాయి. ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేవరకు జనసేన నిద్రపోదు. జగన్ రెడ్డికి చెబుతున్నా.. వైసీపీలోని ప్రతి ఒక్కడికి పేరు పేరునా చెబుతున్నా.. నా పేరు పవన్ కల్యాణ్.. మా అడపడుచులను కొట్టినవాళ్లను ఎప్పటికీ మర్చిపోను. కానిస్టేబుల్ నుంచి కేబినెట్ మంత్రిదాకా అందరికీ మదమెక్కింది కాబట్టే ఇలాంటి పనులుచేస్తున్నారు.

నేను ముందే హెచ్చరించా..
రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూవచ్చాను.. వైసీపీ పార్టీ వ్యక్తిత్వం మంచిదికాదు. వాళ్లది రౌడీ కల్చర్. ఫ్యాక్షనిస్టు కల్చర్ ని ప్రజలపై రుద్దుతారని ముందే హెచ్చరించా. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అవసరమైనప్పుడు మంచో, చెడో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వాలు కూడా పాటించితీరాలి. తప్పించుకుంటామంటే కుదరదు. ఎవడైనా శుభమాని శంకుస్థాపనలతో మొదలుపెడతారు.. వీళ్లు మాత్రం కూల్చివేతలతో పాలన మొదలుపెట్టారు. అతిత్వరలోనే వీళ్లు కూడా కూలిపోతారు.

వైసీపీ అనేదే లేకుండా చెయ్యాలి..
ఒక కులానికి చెందినవాళ్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే నెపంతో.. రాజధాని ప్రాంతంలోని చిన్న రైతులున్ని దారుణంగా ఏడిపించారు. అందులో అన్ని కులాలవాళ్లు ఉన్నారు. కనీసం దివ్యాంగులని కూడా చూడకుండా వారిపై పోలీసులు పాశవికంగా దాడి చేశారు. వికేంద్రీకరణ బిల్లుతో వైసీపీ వినాశనం మొదలైంది. నా కోపం, ఆవేదన స్థాయి దాటిపోయింది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ వైసీపీ అనే పార్టీ అధికారంలో ఉండకూడదు. దాన్ని సంపూర్ణంగా పెకిలించేయాలి.

రాజధాని అమరావతిలో ఉండటమే ధర్మం
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే. అదే ధర్మం. అదే న్యాయం. ఈ మాట చెప్పినందుకు రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లో జనసేనకు నష్టం జరుగుతుందేమోనన్న భయాల్ని నేను పట్టించుకోను. ఎందుకంటే ధర్మాన్ని మనం కాపాడుతే.. అదే మనల్ని కాపాడుతోంది. అమరావతి పరిరక్షణ పోరాట సమితి పేరుతో అందరం కలిసి పోరాడుదాం. నేను అన్ని ప్రాంతాలన్నిప్రేమిస్తాను కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలి.

భూముల మీద ప్రేమతోనే వైజాగ్ కు..
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటోన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా కేసులు నమోదుచేయలేదు. వాళ్లకు అమరావతిలో భూములుంటే అసలీ వ్యవహారం బయటికొచ్చేదేకాదు. వైసీపీ నేతలకు వైజాగ్ లో భూములన్నాయి కాబట్టే రాజధానిని తీసుకెళుతున్నారు. అంతేగానీ ప్రజలపై ప్రేమకాదు. రాజధానిని తరలించడానికి రైతులపై దాడులు చేశారు. వాళ్ల ఒంటిమీదపడ్డ ఒక్కో దెబ్బ.. వైసీపీ సర్వనాశనానికి దారితీస్తుంది.. మాటలురాని, బాధను చెప్పుకోలేని వికలాంగుల బాధ దేవుడు వింటాడు.. మీకు నష్టం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యేవరకు భగవంతుడు ఊరుకోడు.

పోలీసుల్ని రౌడీలుగా మార్చారు..
నా గుండెల్లో తీవ్రమైన ఆవేదన, ఏడుపు ఉంది.. పోలీసు శాఖను శాంతిభద్రతకు వాడకుండా రౌడీలుగా మార్చేశారు. పోలీసువాళ్లు కూడా వీధిగుండాల్లా రెచ్చిపోతున్నారు. నన్ను కూడా కట్టడిచేసి కదలనీయలేదు. డీఐజీ స్థాయి అధికారిని పెట్టారు.. టచ్ చేస్తే హత్యాయత్నం కేసులు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు.. అవన్నీ తట్టుకుని.. ఇది రాజకీయ పోరాటం కాబట్టే నేను నిన్న బయటికి రాలేదు. బీజేపీకి కూడా ఇదే మాట చెప్పాం.. అమరావతికి కట్టుబడి ఉన్నాం.. మీకు కట్టుబడి ఉన్నారా? అని అడిగాం.. మోడీ ఇక్కడ శంకుస్థాపన చేశారు కాబట్టి దాన్ని గౌరవిస్తున్నాం... దాన్ని కేంద్రం ఎలా తీసుకుంటుందో తెలియదు.. పార్టీలపరంగా మాత్రం గట్టిగా పోరాడుతాం.












Click it and Unblock the Notifications