పవన్ కళ్యాణ్తో సోము వీర్రాజు భేటీ: బద్వేల్ ఉపఎన్నిక సహా కీలక అంశాలపై చర్చ
గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉపఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
అక్టోబర్ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు. అక్టోబర్ 7న నెల్లూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మత్స్య గర్జన సభ వివరాలను బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్కు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, మధుకర్లు కూడా పాల్గొన్నారు.

ఉప ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు సోము వీర్రాజు. తాము కచ్చితంగా బద్వేలు ఉప ఎన్నికల బరిలో నిలుస్తామని తేల్చిచెప్పారు. అయితే ఏ పార్టీ నుండి అభ్యర్థి బరిలో నిలుస్తారన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా, బద్వేలు ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉపఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధను వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిగా వైసీపీ బరిలో నిలపనుంది. ఇక, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది.
బద్వేలు(ఎస్సీ రిజర్వుడ్) ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించి.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నియోజకవర్గంలో 2,04,618 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,02,811 మంది పురుషులు, 1,01,786 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మరోవైపు, సోము వీర్రాజుతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. అక్టోబర్ 2 నేరుగా పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకోనున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేస్తారని ఇది వరకే ప్రకటించారు. అయితే శ్రమదానం కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో జనసేన కార్యక్రమం నిర్వహణ చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
రాష్ట్రంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన ఆధ్వర్యంలోనే రోడ్లకు మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టారు పవన్ కళ్యాణ్. మరోవైపు, సినిమా టికెట్లను ఆన్లైన్లో ప్రభుత్వమే విక్రయించడంపై పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ కూడా పవన్ కళ్యాణ్ పై ఈ విషయంలో మండిపడ్డారు. ఈ క్రమంలో పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. దీంతో దాడి చేసింది పవన్ అభిమానులేనని పోసాని, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు ఆ దాడితో సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications