గుంటూరు సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మ: ఎన్నో ప్రశ్నలు: ఆమె వెంటే సీపీఐ నేతలు
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను ప్రచారం చేస్తోన్నారనే విషయం మీద కేసులను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు రంగనాయకమ్మ.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆమె గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వర రావు ఉన్నారు. తన కుటుంబ సభ్యులు, కుటుంబ న్యాయవాదితో కలిసి రంగనాయకమ్మ సీఐడీ కార్యాలయానికి వచ్చారు.

నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారనే కారణంతో..
గుంటూరు లక్ష్మీపురంలో నివసించే రంగనాయకమ్మ కొద్దిరోజుల కిందట తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని షేర్ చేశారు. ఆ సమాచారం.. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువులు వెలువడటానికి సంబంధించినది. ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఈ కంపెనీలో అంతర్గతంగా అనుమానాస్పద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, దాని ఫలితంగానే స్టైరిన్ గ్యాస్ విడుదల అయిందనే విషయాన్ని పోస్ట్ చేశారు. ఈ నెల 12న ఆమె తన ఫేస్బుక్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.

సీఐడీ నోటీసులు..
దానితో పాటు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్.. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సందర్శించడంపైనా అనుమానాలను వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఆ సమాచారం కాస్త వైరల్గా మారింది. పోలీసుల దృష్టికి చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఈ కేసును సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆమెకు నోటీసులు ఇచ్చారు. విచారణను ఎదుర్కొనడానికి సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు.

ఏ1గా పేర్కొన్న సీఐడీ
దీనితో ఆమె ఈ మధ్యాహ్నం గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. ఈ కేసులో సీఐడీ అధికారులు రంగనాయకమ్మ పేరును ఏ1గా నమోదు చేశారు. మల్లాది రఘునాథ్ అనే వ్యక్తిని ఏ2గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు ఆమెపై పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారని ఆరా తీసినట్లు సమాచారం. రంగనాయకమ్మ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారా అనే అంశంపైనా కూపీ లాగినట్లు చెబుతున్నారు. మల్లాది రఘునాథ్ వద్ద నుంచి వచ్చిన పోస్ట్ను తాను యధాతథంగా కాపీ చేసి తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాననేది రంగనాయకమ్మ వాదన.

రాజకీయ దుమారానికి
రంగనాయకమ్మకు నోటీసులను జారీ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పట్టిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సహా కొందరు మాజీ మంత్రులు రంగనాయకమ్మకు నోటీసులను జారీ చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 66 సంవత్సరాల వయోధిక వృద్ధురాలైన రంగనాయకమ్మ పట్ల ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తించిందని ఆరోపించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వంటి నాయకులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి సంఘీభావాన్ని తెలిపారు.

ప్రతిపక్షాల నుంచి విమర్శలు..
రంగనాయకమ్మపై కేసు పెట్టడాన్నిభారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు స్పందించారు. ప్రభుత్వం ఉద్దేశపూరకంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశాన్ని సైతం కాలరాస్తోందని మండిపడ్డారు. రంగనాయకమ్మకు తాము అండగా ఉంటామని అన్నారు. చెప్పినట్లుగానే రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వర రావు సీఐడీ కార్యాలయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications