హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హంగామా; ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు, వైద్యుల తీరుపై అసంతృప్తి
హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను, వైద్యుల పనితీరును బాలకృష్ణ పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలయ్య హంగామా స్థానికంగా హాట్ టాపిక్ అయింది.
హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సౌకర్యాలపై ఆసుపత్రి సిబ్బంది, రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సందర్శించి అక్కడ వైద్య సేవలను పరిశీలించారు. నేరుగా పేషెంట్ల వద్దకు వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే బాలయ్యను చూసిన రోగులు ఆసుపత్రిలోని సమస్యలపై బాలకృష్ణ కు ఫిర్యాదు చేశారు.
బాలయ్యకు రోగుల ఫిర్యాదు ..వైద్యుల పనితీరుపై బాలకృష్ణ అసంతృప్తి
వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆసుపత్రిలో ఉండడంలేదని, ప్రైవేటు క్లినిక్ లను నిర్వహించుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆసుపత్రిలో ఉన్న రోగులు ఫిర్యాదు చేశారు. దీంతో బాలకృష్ణ ఆసుపత్రి వర్గాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు ఆసుపత్రిలో లేవని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానన్న బాలకృష్ణ
వైద్యుల నిర్లక్ష్యంతో రెండు రోజుల పసికందు చనిపోయిందంటూ బాలకృష్ణ ముందు శ్రవణ్ అనే వ్యక్తి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఆసుపత్రి సూపరిండెంటెంట్ ను పిలిచి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని బాలకృష్ణ పేర్కొన్నారు. గతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బాలకృష్ణ హిందూపురం ఆసుపత్రికి కావలసిన వైద్య సదుపాయాలు కల్పించారు. తన సొంత డబ్బులతో వెంటిలేటర్ల ను సమకూర్చారు.
హిందూపురం పర్యటనలో రాయలసీమ నీళ్ళ కోసం బాలయ్య ధ్వజం
ఇదిలా ఉంటే హిందూపురం పర్యటనలో భాగంగా ఆదివారం హిందూపురంలో జరిగిన రాయలసీమ టిడిపి నేతలు నిర్వహించిన సదస్సులో బాలకృష్ణ పాల్గొన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా సాగిన ఈ సదస్సులో బాలకృష్ణ ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతోందని, రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని బాలకృష్ణ తెలిపారు. రాయలసీమకు నీరిచ్చే ఆలోచన జగన్ సర్కార్ కు లేదని ధ్వజమెత్తారు బాలకృష్ణ .
రాయలసీమ జలాల కోసం హర్యానా తరహాలో ఉద్యమం : బాలయ్య వార్నింగ్
రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుట్టారని రాయలసీమ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి జోలె పెట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కులాలు మతాలు మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రభుత్వ తీరుపై బాలకృష్ణ నిప్పులు చెరిగారు . రాయలసీమకు నికర జలాలు కేటాయించాలని ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమం చేస్తామని బాలకృష్ణ హెచ్చరించారు. రెండు రోజులుగా ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.