Rahul Flying Kiss : రాహుల్ ఫ్లైయింగ్ కిస్- స్మృతీకేనంటూ బీజేపీ మహిళా ఎంపీల ఫిర్యాదు
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా మణిపూర్ వ్యవహారంలో కేంద్రం తీరుపై, ప్రధాని మోడీ నిర్లిప్తతపై నిప్పులు చెరిగారు. మణిపూర్ లో భారత్ ను చంపేశారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఈ ప్రసంగం ముగియగానే అధికార పక్షం వైపు చూస్తూ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి రాహుల్ వెళ్లిపోయారు. దీంతో అప్పటివరకూ రాహుల్ చేసిన విమర్శల సంగతి పక్కనబెట్టి దీనిపై బీజేపీ దృష్టిపెట్టింది.

రాహుల్ గాంధీ లోక్ సభలో బీజేపీ ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని ఆయన తర్వాత ప్రసంగం చేసిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తప్పుబట్టారు. బీజేపీ మహిళా ఎంపీల వైపు చూస్తూ రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని, గాంధీ కుటుంబం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. దీంతో బీజేపీ ఎంపీలు ఆమెకు మద్దతుగా నిలిచారు. రాహుల్ పై తన ప్రసంగంపై నిశిత విమర్శలు చేసిన స్మృతీ ఇరానీ.. ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ పై ఫిర్యాదు చేశారు. స్మృతీ ఇరానీ ప్రసంగం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఆమెవైపు చూస్తూ అసభ్యంగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీకి చెందిన 21 మంది మహిళా ఎంపీలు సంతకాలు చేసి రాతపూర్వకంగా స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలో రాహుల్ ప్రవర్తన అనుచితంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ తన చర్యతో కేవలం మహిళా ఎంపీల గౌరవానికి భంగం మాత్రమే కలిగించలేదని, లోక్ సభ గౌరవాన్ని కూడా తగ్గించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వివాదాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ సహా పలు అంశాలపై విపక్షాలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వాటికి కౌంటర్ గా రాహుల్ ఫ్లయింగ్ కిస్ ను తెరపైకి తెచ్చి చర్యలకు డిమాండ్ చేసేందుకు బీజేపీ ఎంపీలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ మహిళా ఎంపీలతో ఈ వివాదాన్ని రాజేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications