గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు కూడా: సీఎం కేసీఆర్
సమైక్యత వజ్రోత్సవ వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను 10 రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించారు.హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గిరిజన, బంజారా భవన్లను ఆయన శనివారం ప్రారంభించారు.
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న దళిత బంధు మాదిరిగానే గిరిజనులు డెవలప్ అయ్యేందుకు పాటుపడతామని చెప్పారు. త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని సూత్రప్రాయంగా తెలిపారు.గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆమోదం కోసం కేంద్రానికి పంపించామని తెలిపారు.
కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పని లేకుండా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం శనివారం.. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు వేడుకలను జరపలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా వేడుకలను జరిపింది. సాయుధ పోరాటం జరిపిందే కమ్యూనిస్టులు అని సీపీఐ నారాయణ అంటున్నారు. మొత్తానికి తెలంగాణ యావత్ వేడుకలు జరుపుకుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.