50 రకాల వంటకాలు, స్వీట్స్, స్నాక్స్ కూడా.. యాదమ్మ చేతి వంట రెడీ (వీడియో)
యాదమ్మ.. ఆమె చేతి రుచి చూసినవారు ఎవరైనా సరే వాహ్వా అనాల్సిందే. ఇవాళ బీజేపీ దిగ్గజాలు యాదమ్మ చేతి వంట రుచి చూడబోతున్నారు. 50 రకాల వంటకాలను సిద్దం చేశారు. వంటకాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్వయంగా పరిశీలించారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన సంజయ్కు రుణపడి ఉంటానని యాదమ్మ అంటున్నారు.
తెలంగాణ వంటలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ దిగ్గజాలు ఇవాళ తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్లో తయారు చేశారు. స్వీట్స్ కూడా తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తున్నారు. స్వీట్స్ సహా 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేశారు.
ఇవీ డిషెస్
చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ చేశారు.
స్వీట్, స్నాక్స్
బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు స్వీట్స్.. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి ఇవీ స్నాక్స్గా అందజేస్తారు. యాదమ్మ చేతి వంటి తింటే మరోసారి గుర్తుకు చేస్తారని అంతా అంటారు. నేటి వంటలతో ఆమె పేరు యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది.
ఇదీ నేపథ్యం
యాదమ్మ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవల్లి.. ఆమెకు చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన వ్యక్తితో పెళ్లయ్యింది. తర్వాత యాదమ్మ కరీంనగర్ వచ్చేసింది. మంకమ్మతోటలో వెంకన్న వద్ద వంటలు నేర్చుకుంది. శాఖహారం, మాంసాహారం వంటలు రుచిగా చేస్తోంది. తిన్న వారంతా వావ్ బాగుందని అంటారు. ఇవాళ ప్రధాని మోడీ సహా అతిరథ మహారథులు ఆరగించనున్నారు. తెలంగాణ వంటల రుచుల ఖ్యాతి దేశానికి వ్యాపించనుంది.