ఆరు నెలల్లో 80వేల ఉద్యోగాల భర్తీ: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హరీశ్ రావు స్పందన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీక్ కేసు వ్యవహారంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. పేపర్ లీకేజీ నిందితులను గుర్తించిన ప్రభుత్వం కేసులు పెట్టి వాళ్లను జైల్లోవేసిందన్నారు.పేపర్ లీక్ కేసులో నిరుద్యోగులకు నష్టం జరగకుండా చూశామన్నారు. పేపర్ లీక్ ఘటన దురదృష్టకమని అలా జరగాల్సి ఉండకూడదన్నారు.
అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు పెట్టి ఆరు నెలల్లో ఉద్యోగాలు ఇస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. వారి మాటలు నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదావరిలో ఈదినట్లేనని విమర్శించారు.

సిద్దిపేట, నారాయణపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రానున్న 15 రోజుల్లో గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ 16న న్యూట్రీషియన్ కిట్టును ఇస్తామన్నారు.
చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని.. అందుకే న్యూట్రీషియన్ కిట్టును ఇస్తామన్నారు. పుట్టబోయే బిడ్డకు సంవత్సరం వరకు రెండుసార్లు న్యూట్రీషియన్ కిట్టును ఇస్తామని చెప్పారు.
ఇది ఇలావుండగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ముగ్గురి సిట్ కస్టడీ విచారణ ఆదివారం ముగిసింది. షమీమ్,రమేష్,సురేష్ లను 5వ రోజు సిట్ విచారణ చేయనుంది. విచారణ పూర్తి అయ్యాక ఈ ముగ్గురిని న్యాయమూర్తి ముందు సిట్ హాజరు పర్చనుంది. అనంతరం చంచల్ గూడ జైల్ తరలించనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే కమిషన్ సభ్యులను సిట్ విచారిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన టీఎస్ పీఎస్సీ సెక్రెటరీ అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు నమోదు చేశారు. సెక్రెటరీ పీఏగా ప్రవీణ్ ఉండటంతో ప్రవీణ్ గ్రూప్ 1 రాసిన అంశంపై అనిత రామచంద్రన్ ను సిట్ వివరాలు అడిగింది. సభ్యుడు లింగా రెడ్డి కి పీఏగా రమేష్ ఉండడంతో లింగారెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించింది. పలు వివరాలు తెలుసుకుంది.












Click it and Unblock the Notifications