కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు: మంత్రితో వాగ్వాదమే కారణం?
యాదాద్రిభువనగిరి: రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డితో వాగ్వాదం నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలో లక్కారంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొంత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. మంత్రి జగదీశ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తనను ఆహ్వానించలేదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తి చేశారు. ఆందోళనకు దిగారు. తనకు ముందుగా సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ఫొటో పెట్టారని, ఇక్కడెందుకు లేదని నిలదీశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేనని తనపై వివక్ష చూపుతున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఆకలి, దారిద్ర్యం, ఆత్మహత్యలకు రూపుమాపామని అన్నారు. అయితే, ఎమ్మెల్యే రాజగోపాల్ తన కుర్చీలోంచి లేచి రాజకీయ ప్రసంగం వద్దంటూ మంత్రిని అడ్డుకున్నారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే జగదీశ్ రెడ్డి.. మంత్రి కాలేకపోయేవారన్నారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తీసుకురాలేదని, పార్లమెంటులో ఎంపీగా పోరాడానని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతేగాక, మంత్రి చేతిలోంచి మైకు లాక్కునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరింది.
జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, పురపాలిక ఛైర్మన్ రాజు తదితరులు ఎమ్మెల్యేను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశంలో పోలీసులు ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు సమావేశం నుంచి బయటకు పంపారు.
ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించారు. కాగా, సమావేశంలో జరిగిన రసాభాసపై చౌటుప్పల్ తహసీల్దార్ గిరిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.