ప్రేమోన్మాది ఘాతుకం: మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుందని యువతిపై కత్తితో దాడి, తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన బాధిత యువతి(20), అదే ప్రాంతానికి చెందిన బస్వరాజు(23) అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం మరో వ్యక్తితో యువతికి నిశ్చితార్థమైంది.
బస్వరాజ్తో ప్రేమ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు.. నిశ్చితార్థమైన నాటి నుంచి యువతిని హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో నివాసం ఉంటున్న ఆమె బాబాయి ఇంట్లో ఉంచారు. సన్సిటీ సమీపంలోని రామ్గేవ్గూడలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బస్వరాజ్కు ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం యువతి ఉంటున్న ఇంటికి చేరుకున్న బస్వరాజు.. ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి పొట్ట, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు యువతిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన బస్వరాజును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, దాడిలో గాయపడిన యువతి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నాయని బాధితురాలికి చికిత్స అందిస్తున్న నవీన ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఛాతీ, ఊపిరితిత్తుల బాగంలో తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని, రెండు రోజులు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు.
కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. వేరే పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి బస్వరాజ్ కత్తితో పొడిచాడని తెలిపింది. గతంలో ఇద్దరం ప్రేమించుకున్నామని, ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని చెప్పింది. వేరే వ్యక్తితో నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నావని బస్వరాజ్ నిలదీశాడని, పెళ్లి ఆపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా, పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఓ యువతిని ప్రేమోన్మాది హత్య చేసిన ఘటన మరువకముందే ఈ దారుణం జరగడం కలకలంగా మారింది.