భాగ్యనగరి సిగలో అమెజాన్ క్యాంపస్.. 10 వేల మందికి ఉపాధి
హైదరాబాద్ : ప్రముఖ ఈ కామర్స్ స్టోర్ అమెజాన్ క్యాంపస్ భాగ్యనగరిలో ప్రారంభమైంది. పదెకరాల స్థలంలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు. 15 అంతస్తుల భవన సముదాయంలో సంస్థకు సంబంధించి స్టోర్లు, ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఇప్పటికే 7 వేల మంది పనిచేస్తుండగా .. మరో 3 వేల మందికి ఉపాధి లభిస్తోందని అమెజాన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
అంకురార్పణ
నానక్రామ్ గూడలోని భవన సముదాయాన్ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. తర్వాత అక్కడ మొక్క నాటారు. కార్యక్రమంలో అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్, సంస్థ స్థిరాస్తి, వసతుల మేనేజర్ జాన్ స్కోట్లర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టోర్. 2016 మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ .. సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడినుంచే అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
దశాబ్దం కిందే
హైదరాబాద్లో అమెజాన్ పదేళ్ల కింద కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ గుర్తించి రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టి క్యాంపస్ నిర్మించింది. ఈ క్యాంపస్లో వ్యాపార నిర్వహణ ప్రణాళిక, కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణ చేపడుతారు.
మిగతా కంపెనీల చూపు
హైదరాబాద్లో అమెజాన్ క్యాంపస్తో మిగతా అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మైక్రోసాప్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి కంపెనీలు హైదరాబాద్లో కొలువుదీరిన సంగతి తెలిసిందే. వీటికితోడు దేశీయ దిగ్జాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. వీటికితోడు అమెజాన్ రావడంతో .. మిగతా కంపెనీలు కూడా హైదరాబాద్ వైపు చూసే అవకాశం ఉంది.