తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం: అమిత్ షా
హైదరాబాద్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఘాటు విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రశ్నించినందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేసిందని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా టీచర్ల నియామకం చేపట్టాలని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఈ అవినీతి సర్కారు త్వరలోనే అంతమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ పేరుతో కేసీఆర్ సర్కారు దోచుకుంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాదు.. తెలంగాణ నుంచే ఆ పార్టీని పారద్రోలేందుకు ఇక్కడ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

కేసీఆర్ చెవులు తెరిచి విను.. నిన్ను గద్దె దించేవరకు బీజేపీ పోరాటం ఆగదు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏటీఎంల భావిస్తోందన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అనధికార ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.
దేశంలో ప్రధాని పదవి ఖాళీగా లేదని.. ఆ విషయం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు అమిత్ షా. మళ్లీ కూడా ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీనే కూర్చుకుంటారని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనూ, తెలంగాణలోనూ బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరోసారి ప్రధాని మోడీనేనని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేసిందన్నారు.
కేంద్రం నిధులను కేసీఆర్ స్వాహా చేస్తున్నారన్నారు. ఒవైసీ ఎజెండాతోనే కేసీఆర్ ముందుకు వెళుతున్నారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపిస్తామని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు. అవినీతిలేని అభివృద్ధిని చూపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications