మునుగోడులో కమలం వికసించాల్సిందే, శ్రేణులకు అమిత్ షా స్పష్టీకరణ
తెలంగాణ విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక నెక్ట్స్.. మునుగోడు బై పోల్ గురించి నేతలతో చర్చించారు. ఉప ఎన్నికల్లో కమలం వికసించాలని షా.. స్పష్టం చేసినట్టు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ముగ్గురు నాయకులతో కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీలో రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి నేతలు ఉండాలని సూచించారు. ఉపఎన్నికపై అమిత్ షా తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తర్వాత తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో కూడా డిస్కష్ చేశారు.
బూత్ కమిటీ పక్కాగా పని చేయాలని అమిత్ షా సూచించారు. గ్రామాల వారీగా ఇంఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. జాయినింగ్ కమిటీ ప్రగతిపై రాష్ట్ర నేతలను ఆరా తీశారు. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా ఆదేశించారని తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
జాతీయ నాయకత్వం అంచనాలను అనుగుణంగా పని చేయలేకపోతున్నారని.. లక్ష్యాలను అందులేకపోతున్నారని క్లాస్ పీకారని సమాచారం. పార్టీలో సమన్వయం లోపించిందని, కొందరు నేతలు సరిగా పని చేయడం లేదని అమిత్ షా ఫైర్ అయ్యారని తెలుస్తోంది. కేసీఆర్ పాలనపై గుర్రుగా ఉన్న జనాలు బీజేపీ పట్ల ఆసక్తిగా ఉన్నా.. నేతలు సరిగా పనిచేయడం లేదన్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.