దేశంలో ఏ సీఎం అయినా దళితులకు రూ.10 లక్షలు ఇచ్చారా..? మంత్రి కేటీఆర్
దళితబంధు పథకం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది. అర్హులయిన దళితులకు రూ.10 లక్షల నగదు అందజేస్తున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశంలో దళితులకు రూ.10 లక్షలు ఇచ్చినవారు ఎవరైనా ఉన్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. గురువారం ఆంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళిత బంధు విజయవంతం అయితే దేశం యావత్తు తెలంగాణ వైపే చూస్తుందని చెప్పారు.
తమ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పేరుతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే పథకానికి రూపకల్పన చేసిందని ఆయన వివరించారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో దళితులకు పెద్దపీట వేశామని తెలిపారు. ప్రపంచంలో ఉన్నవి రెండే కులాలు. ఒకటి ఉన్నవారు. లేనివారు అని చెప్పారు. అమెరికాలో కూడా రెండు కులాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఒకటి నల్లోడు, రెండు తెల్లోడు అని చెప్పారు.
హైదరాబాద్లో కూడా కులాలకు పట్టింపులు ఉండవని కేటీఆర్ అన్నారు. దేశంలో కులం, మతం పిచ్చి పెరుగుతోంది అని కామెంట్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం మోడీ చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. వారు రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కేంద్రం ప్రభుత్వం ఓర్వలేక అభివృద్ధికి అడ్డుపడుతోందని ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనపై అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది ఎవరో ఆలోచించాలని.. వ్యవస్థలను కుప్పకూలుస్తుంది ఎవరు? వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మంచి పనులు చేస్తుంటే కేంద్రం అడ్డుపడుతోందని.. మంచి చెడులను ప్రజలు ఎన్నికల్లో చూసుకుంటారని చెప్పారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కట్టుబడి ఉందని చెప్పారు.