కేటీఆర్ సార్.. : మున్సిపల్ టికెట్ల కోసం ఏపీ ఎమ్మెల్యేలు,మంత్రుల లాబీయింగ్..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న జరిగే ఎన్నికల కోసం పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. అదే సమయంలో టికెట్ల కేటాయింపులు,రెబల్స్ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల గడువుకు ఒకరోజు ముందే టీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు దాదాపుగా పూర్తయిపోయింది. పోటీ ఎక్కువగా కొన్ని స్థానాలకు నామినేషన్ల చివరి రోజైన శనివారమే టికెట్లు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో హైదరాబాద్ శివారులోని కొన్ని స్థానాలు కూడా ఉండటంతో.. అక్కడ టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఏపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు మంత్రి కేటీఆర్కు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ మున్సిపాలిటీల్లో.. :
హైదరాబాద్ శివారులో కొత్తగా ఏడు మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు 17 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇందులో నిజాంపేట,మణికొండ,బడంగ్పేట్,మీర్పేట్,తెల్లాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినవాళ్లూ ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పుడు మున్సిపల్ టికెట్ల ఆశావహుల జాబితాలో ఉన్నారు.

టికెట్ల కోసం కేటీఆర్కు ఫోన్లు :
స్థానిక నేతలు కావడంతో టికెట్ల కోసం టీఆర్ఎస్ పెద్ద తలకాయలను పట్టుకోవడం వారి వల్ల కావట్లేదు. దీంతో ఏపీ నుంచి రాయబారం మొదలుపెట్టిన కొంతమంది నేతలు.. అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఫోన్లు చేయిస్తున్నారట. తమవాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ ఏపీకి చెందిన సదరు నేతలు కేటీఆర్ను కోరుతున్నారట. 10వ తేదీ నామినేషన్లకు చివరి గడువు కావడంతో.. గత రెండు రోజులుగా కేటీఆర్కు ఏపీ నుంచి చాలా ఫోన్లు వచ్చాయని తెలుస్తోంది.

రెండు చోట్ల లబ్ది.. :
ఇక్కడి మున్సిపల్ ఎన్నికల్లో తమవారికి టికెట్లు ఇప్పించుకోవడం తమకు కూడా లబ్ది చేకూరే అంశమే కాబట్టి ఏపీలోని పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు టికెట్ల కోసం గట్టిగానే ప్రయత్నించారట. అయితే
మంత్రి కేటీఆర్ మాత్రం స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయం,అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టే టికెట్లు ఇస్తున్నట్టు వారితో చెప్పారట. అయినప్పటికీ చివరి నిమిషం వరకు తమవాళ్లకు టికెట్లు ఇప్పించుకునేందుకు కేటీఆర్పై వారు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ :
ఈ నెల 22న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 25వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. గతేడాది జరిగిన జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే పలు సర్వేల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందంటూ గురువారం ఎమ్మెల్యేలతో సమావేశంగా కేసీఆర్ చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పారు. అందరిని కలుపుకుని సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీజేపీ కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ శక్తి మేర కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications