Must Read: హైదరాబాదులో ఆటో డ్రైవర్ల ఖేల్ ఖతం.. అధిక డబ్బులు వసూలు చేస్తే ఇలా చేయండి..!
హైదరాబాద్ : హైదరాబాదులో ఆటో ఎక్కాలంటే డ్రైవర్లు అధికంగా వసూలు చేస్తున్నారా.. కొంత దూరానికే న్యాయంగా తీసుకోవాల్సిన డబ్బుల కంటే ఎక్కువగా పిండుతున్నారా.. పెట్రోల్ ధరలు పెరిగాయని చెబుతూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారా.. అయితే వారికి సమయం దగ్గరపడింది. ఇక డబ్బులు అన్యాయంగా వసూలు చేసే ఆటోడ్రైవర్లపై నేరుగా మీరే ఫిర్యాదు చేయొచ్చు. ఆ అవకాశం సైబరాబాద్ పోలీసులు కల్పిస్తున్నారు. ఇందుకోసం మీ స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటే చాలు. ఒకే ఒక్క క్లిక్తో ఆటో డ్రైవర్ భరతం పట్టేందుకు రెడీగా ఉన్నారు సైబరాబాద్ పోలీసులు.

మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం
హైదరాబాదులో ఆటో డ్రైవర్ల ఆగడాలు ఎక్కువైయ్యాయి. ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన డబ్బులకన్నా అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ నుంచి ఒక్క క్లిక్ ఇస్తే చాలు పోలీసులు ఫలానా ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకుంటారు. మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఈ పద్ధతిని తీసుకొచ్చారు. ఆటో డ్రైవర్లు నిబంధనలను ఉల్లంఘించినా, ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించినా డ్రైవర్ సీటుకు వెనకాల ఉండే క్యూఆర్ కోడ్ను మీఫోన్ ద్వారా స్కాన్ చేసి పంపితే చాలు. ఇక మీరు నిర్భయంగా ఉండొచ్చు.
డబ్బులు అధికంగా వసూలు చేస్తే..
నగరంలోని పౌరులకు అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. ఆటోడ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే ఎలా ఫిర్యాదు చేయాలో ఈ వీడియో ద్వారా వివరించారు. ఇదే విషయాన్ని ట్వీట్ కూడా చేశారు. అధిక చార్జీలు వసూలు చేసినా, ఒక కస్టమర్ ఫలానా ప్రాంతానికి వెళ్లాలి అని అడిగినప్పుడు తిరస్కరించినా, పదే పదే హారన్లు కొట్టినా, డ్రైవర్ పక్కన మరొకరు కూర్చుని ఉన్నా, ఆటోలో లౌడ్ స్పీకర్లు వినియోగించినా ఇవ్వన్నీ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. అంతేకాదు నగరవాసులు సోషల్ మీడియా ద్వారా తమ ఫిర్యాదులు నమోదు చేయొచ్చని చెప్పారు. వాట్సాప్ ఫేస్బుక్, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని అదే సమయంలో ఫిర్యాదుల కోసం 8500411111 నెంబర్కు ఫోన్ చేయొచ్చని చెప్పారు.
ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదు
2019 ఆగష్టు 5న ఈ నూతన విధానంను ప్రారంభించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమం కింద 14,500 ఆటో రిక్షాలు రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటుండటం, అదే సమయంలో ప్రయాణికులతో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా ఆటోను నడపుతూ ఉండటంలాంటి ఫిర్యాదులు వచ్చాయని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకురావడం హర్షించదగ్గ విషయమని నగరవాసులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో నగరపౌరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications