ఆ కోర్సులో చేరు, బండి సంజయ్పై మంత్రి హరీశ్ రావు విమర్శలు
క్షుద్ర పూజల పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ నల్ల పిల్లిని వధించి పూజలు అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై టీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా స్పందించింది. బండి సంజయ్పై ఒంటికాలిపై లేచింది. తమ పార్టీని ఎదుర్కొలేకనే అంటూ ఫైరయ్యింది.
టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే.. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వాస్తవానికి వీటిని ప్రోత్సహించేది బీజేపీయేనని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ బెనారస్ వర్సిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్, వెళ్లి ఆ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఓట్ల కోసం డబ్బులు పంచడమేగాకుండా 2 వేల కార్లు, 2 వేల బైకులు కొనిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నాయకులను సైతం ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. బైకులు, కార్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నిచేసినా ప్రజలు మాత్రం తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. విజయం తమ పార్టీదేనని చెప్పారు.