ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మరో కేసు నమోదు.. బెదిరింపులు రావడంతో ఫైల్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కొత్త కేసు ఫైల్ అయ్యింది. కేసులో బాధితులుగా ఉన్న టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఫోన్ కాల్స్ వచ్చిన నెంబర్లను సేకరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న వారెవరనే విషయాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేపింది. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టీ మరీ తెలిపారు. సదరు వీడియోలను దేశంలో గల అందరూ ప్రముఖులకు పంపించారు. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. ఇటు కేసీఆర్పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.
కేసీఆర్ విఠాలాచార్య నాటకాలకు అదరబోం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంతకుముందు స్పష్టంచేశారు. ఫామ్ హౌస్ ఇష్యూపై తొలుత కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపించాలని కోరారు. తమకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని.. కానీ ప్రభుత్వంపై లేదని చెప్పారు. అందుకే సీబీఐ విచారణ కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది.