కేసీఆర్-జగన్.. రహస్య ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా,ఆర్థికంగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని.. తెలంగాణలోని నాలుగు జిల్లాలైన రంగారెడ్డి,నల్గొండ,పాలమూరు,ఖమ్మం ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగేంతవరకు కేసీఆర్ స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంజయ్ బుధవారం(మే 13) నిరసన దీక్షకు దిగారు.
కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రయోజనాలను చూసుకుంటుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న జీవో ఇస్తే... కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.కేసీఆర్ది ఉద్యమ సమయంలో ఓ పద్ధతి, అధికారం వచ్చాక మరో పద్ధతి అని విమర్శించారు.
ఇప్పటికైనా ఆ జీవో రద్దుకు చర్యలు తీసుకోండి..
ఏపీకి చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్,జగన్ అన్నాదమ్ముల్లా సఖ్యతతో ముందుకు సాగుతున్నారని చెప్పారన్నారు. కానీ ఈ ఇద్దరు అన్నాదమ్ములు కలిసి రాష్ట్ర ప్రజలను ఏవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో దీని ద్వారా స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్ ద్వంద్వ విధానాలను అవలంభిస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అసలేంటీ వివాదం..
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రెట్టింపు చేసి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం జీవో.203ని జారీ చేసింది. ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు,అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడమేంటని ప్రశ్నిస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని.. తమ ప్రాజెక్టులకు నీళ్లు అందవని ఆందోళన చెందుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం కృష్ణా జలాల పంపిణీ ప్రకారం రాష్ట్ర వాటా రూపంలో వచ్చే నీటినే వాడుకుంటున్నామని.. ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని, రాజకీయం చేయడం సమంజసం కాదని కోరుతోంది.