శాపంగా మారిన రెవెన్యూ లోపాలు..? కేసీఆర్ సర్కార్పై విజయశాంతి నిప్పులు
టీఆర్ఎస్ సర్కార్పై ఫైర్ బ్రాండ్, బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ లోపాలు రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పారు. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసిందని విషయాన్ని గుర్తుచేశారు.
ఇదే కాదు అంతకుముందు మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో చనిపోయిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుంటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదన్నారు. శివ్వంపేటలోని తహసీల్ కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రెవెన్యూ లోపాలపై మీడియాలో వస్తున్న సంఘటనలే ప్రధాన అంశాలుగా కనిపించాయని విజయశాంతి అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇలాంటి అనుభవాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉన్నాయని విమర్శించారు. కొంతమంది రైతులకు అరకొరగా రైతుబంధు డబ్బులు అందినా... పాత బాకీల కింద బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ ఇబ్బందులతోపాటు నకిలీ విత్తనాలు, పంట కొనుగోళ్ల ఇబ్బందులు ఉండనే ఉన్నాయని విజయశాంతి దుయ్యబట్టారు.
ధరణి వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని విజయశాంతి మండిపడ్డారు. వెబ్ సైట్ రైతులతోపాటు, ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలని చెప్పారు.












Click it and Unblock the Notifications