కేంద్రంలో పవర్‌ఫుల్.. ఏపీలో బలపడే ప్రయత్నం.. మరి తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూరా?

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి ఆధిపత్యం చాటుకుంది. దాదాపుగా దేశమంతటా మోడీ హవా కొనసాగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ హైకమాండ్ ఆశించినంత ఫలితాలు రాలేదని చెప్పొచ్చు. అదలావుంటే రెండు రాష్ట్రాల్లో బలపడేలా స్థానిక బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీలో బలమైన నేతలకు కండువా కప్పి పార్టీలోకి లాగుతుంటే.. తెలంగాణలో నాయకత్వలోపం కారణంగా ఛోటామోటా నేతలకు గాలం వేస్తున్నారనే వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రంలో పవర్‌ఫుల్‌గా మారిన బీజేపీ.. ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం పక్కా ఫెయిల్యూర్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సెంట్రల్‌లో కుర్చీ.. తెలుగు రాష్ట్రాల్లో మరి..!

సెంట్రల్‌లో కుర్చీ.. తెలుగు రాష్ట్రాల్లో మరి..!

2014లో ఎన్డీయే రూపంలో అధికారం చేపట్టిన బీజేపీ.. 2019 నాటికి బలమైన శక్తిగా ఎదిగింది. మోడీ ఛరిష్మా తోడై లోక్‌సభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి మరోసారి సెంట్రల్ కుర్చీ దక్కించుకుంది. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 303 పార్లమెంటరీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం కనిపించినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంత పెద్దగా వర్కవుట్ కాలేదు.

తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో బలం పుంజుకుందని బీజేపీ లోకల్ లీడర్లు గొప్పగా చెప్పుకుంటున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం చాలా లైట్‌గా తీసుకున్నట్లు సమాచారం. మరికొన్ని స్థానాల్లో గెలవాల్సిందని హైకమాండ్ భావనగా కనిపించింది. అయితే 2024 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో బలం పుంజుకోవాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ కమలం.. ఏపీలో విజయవంతం

ఆపరేషన్ కమలం.. ఏపీలో విజయవంతం

ఏపీలో ఆపరేషన్ కమలం దిశగా బీజేపీ అడుగులు వేసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీతో దోస్తీ కట్టి.. టీడీపీ నేతలకు గాలం వేసేందుకు సిద్ధమైంది. ఆ క్రమంలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కమలతీర్థం పుచ్చుకోవడం చర్చానీయాంశమైంది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహనరావు బీజేపీ గూటికి చేరారు.

ఏపీలో బలపడేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ హైకమాండ్ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. పెద్ద తలకాయలకు గాలం వేస్తూ ఏపీలో పార్టీని బలపరిచే విధంగా అడుగులేస్తోంది. అందులోభాగంగానే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులకు కమల తీర్థం పోసింది. ఇక టీడీపీకి మిగిలిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులను సైతం బీజేపీ గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి.

హైకమాండ్ ఆదేశాలు సరే.. తెలంగాణ నేతల పరిస్థితేంటి..!

హైకమాండ్ ఆదేశాలు సరే.. తెలంగాణ నేతల పరిస్థితేంటి..!

ఏపీలో ఏకంగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులకు కండువా కప్పి పార్టీలోకి లాగితే.. తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్‌లా కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర నేతలు పనిచేయలేకపోతున్నారనే వాదనలున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల్లోని పెద్ద తలకాయలకు గాలం వేయాల్సింది పోయి ఛోటా మోటా లీడర్లను పట్టుకొస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్, చాడ సురేశ్ రెడ్డి.. ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరని చెప్పొచ్చు. వాళ్లతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పీసీసీ మైనార్టీ లీడర్ షేక్ రహ్మతుల్లా లాంటి నాయకులకు కమల తీర్థం పోయించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. అయితే వీరంతా పెద్దగా ప్రభావం చూపబోరని.. ఇలాంటి నేతలను పార్టీలోకి తీసుకొచ్చి ఏం ప్రయోజనమనే వాదనలు లేకపోలేదు.

అదలావుంటే ఎన్నికల వేళ కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరిన డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి లాంటి పెద్ద తలకాయలు పార్టీలో చేరినా.. ఇప్పుడు వాళ్లు కూడా ఎక్కడ యాక్టివ్‌గా కనిపిస్తున్న దాఖలాలు లేవు. పార్టీ కోసం వారు పనిచేయడం లేదా.. కాదంటే రాష్ట్ర నాయకత్వం వారిని కలుపుకొని పోవడం లేదా అనేది ప్రశ్నార్థకమే.

తెలంగాణలో ఆపరేషన్ కమలం తూతూ మంత్రమేనా..!

తెలంగాణలో ఆపరేషన్ కమలం తూతూ మంత్రమేనా..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వమే అసలు యాక్టివ్‌గా లేదనే ప్రచారముంది. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ తూతూ మంత్రంగానే ఉంది తప్ప.. ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలకు కాషాయం కండువా ఛాన్స్ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. యువనేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్ప రాష్ట్రంలో బీజేపీ ముందుకెళ్లలేదని బహిరంగంగానే అంటున్నారు పార్టీశ్రేణులు. ఆ మేరకు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి ఢిల్లీ పెద్దల వర్కింగ్ స్టైల్‌కు తగ్గట్లుగా రాష్ట్ర నేతలు పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా బీజేపీ ఫెయిల్యూర్ కిందే లెక్క. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని మారిస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు ఉండదనే వాదనలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+