హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ వద్ద పేలుడు, ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో గురువారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి, అతడి కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు డంపింగ్ యార్డులో తండ్రి చంద్రన్న(45), కుామరుడు సురేష్(14) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులానే గురువారం కూడా చెత్త ఏరుతుండగా.. పెయింటింగ్ డబ్బాలను కదలించడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఈ పేలుడుతో చంద్రన్న తలకు తీవ్ర గాయమైంది. సురేష్ చేయి విరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
ఘటనా స్థలంలో డాగ్స్క్వాడ్తో నిశితంగా పరిశీలించారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.