దొంగ బాబా: చైతన్యస్వామి అరెస్ట్, 26 లక్షల నగదు, భారీగా బంగారం సీజ్
హైదరాబాద్/నల్గొండ: బాబా అవతారమెత్తి భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్న విశ్వచైతన్య స్వామిని, ఆయన ముగ్గురు శిశ్యులను నల్గొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. భక్తి ముసుగులో తమ వద్ద డబ్బులు, నగలు తీసుకున్నారంటూ బాధితుల నుంచి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మాపూర్లో శ్రీసాయి సర్వస్వం మాన్సీ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అంతేగాక, భక్తి పేరుతో మహిళలను లోబర్చుకుంటున్నాడు విశ్వచైతన్యస్వామి. మోసాన్ని గుర్తించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దొంగ బాబా నిజస్వరూపం బయటపడింది.
ఆశ్రమంపై దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు విశ్వచైతన్య స్వామితోపాటు మరో ముగ్గురు శిశ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల నగదు, దాదాపు కిలో వరకు బంగారం, సుమారు కోటి రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, 7 ల్యాప్టాప్లు, 4 సెల్ఫోన్లు, కారు, మూలికలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. విశ్వచైతన్యస్వామికి 40దేశాల్లో భక్తులు ఉన్నారని ఎస్పీవెల్లడించారు. నిందితుడు 11 మంది మహిళలను లోబర్చుకున్నారని చెప్పారు.
మోసాలకు పాల్పడుతున్న దొంగ పూజారి
పూజారినంటూ మహిళలను మోసం చేస్తున్న దొంగ పూజారి వ్యవహారం వెలుగుచూసింది. హైదరాబాద్ బంజారాహిల్స్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో నివాసముంటున్న ఓ మహి ఇంటికి జూన్ 31న ఉదయం 9గంటలకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తనకు తాను పూజారిగా పరిచయం చేసుకున్నారు. ఆమె ఇంటికి సమీపంలోనే పనిచేస్తున్నానంటూ నమ్మించాడు.
పూజ కోసం మామిడి ఆకులు కావాలని అడిగాడు. దేవుడికి బంగారం, వెండి ఆభరణాలతో పూజలు చేస్తే జీవితంలో మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పాడు. నమ్మిన మహిళ.. రూ. 2.90 లక్షల విలువైన బంగారం ఆభరణాలను నిందితుడికి ఇచ్చింది. పూజలు చేసిన తర్వాత తిరిగి తీసుకొస్తానని చెప్పిన నిందితుడు తిరిగి రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.