అప్పుడు హేళనచేశారు! హైదరాబాద్ ఐటీ అభివృద్ధిపై చంద్రబాబు, మైక్రోసాఫ్ట్, ఐఎస్బీ తేవడంతోనే
హైదరాబాద్: ఐటీ రంగ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించామని, సుదీర్ఘ కృషితోనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటయ్యాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఎస్బీ హైదరాబాద్ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ ఐటీ అభివృద్ధిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

విజన్ 2020 అంటే.. 420 అని ఎగతాళి చేశారన్న చంద్రబాబు
హైదరాబాద్లో ఐఎస్బీ ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేశామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఐటీతోపాటు 11 ఏళ్ల క్రితం నాటిన చెట్టులా ఐఎస్బీ కూడా వృద్ధి సాధించిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి కోసం చాలా శ్రమించామని తెలిపారు.
మహతీర్ మహమ్మద్ విజన్ 2020 గురించి చెప్పారు. ప్రమత్ రాజ్ సహాయం తీసుకోవాలని మహతీర్ సూచించారు. ఆయన లహా మేరకు విజన్ 2020 రూపొందించాం. విజన్ 2020 అన్నప్పుడు కొందరు 420 అని ఎగతాళి చేశారు. కానీ, నాటి కల నేడు సాకరమైంది అని చంద్రబాబు తెలిపారు.

బిల్ గేట్స్తో భేటీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికాకు వెళ్లి అనేకమంది దిగ్గజ ఐటీ కంపెనీల సీఈవోలను కలిశామని చంద్రబాబు చెప్పారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని అప్పట్లో బతిమాలుకున్నామని.. ఆ తర్వాత ఆయనతో 45 నిమిషాలపాటు తమ ప్రణాళిక వివరించామన్నారు చంద్రబాబు.
భారతీయులు గణితంలో స్వతహాగా ప్రతిభావింతులు. గణితం, ఇంగ్లీష్ కలిస్తేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. అని, ఇదే విషయం బిల్ గేట్స్ కు వివరించామని చంద్రబాబు తెలిపారు. ఒక్క మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే.. దాని వెనుక అనేక సంస్థలు వస్తాయని తాము ఆలోచించామని చెప్పారు.

ఎంతో శ్రమించాకే హైదరాబాద్కు ఐఎస్ బీ, మైక్రోసాఫ్ట్: చంద్రబాబు
చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వచ్చాకే హైదరాబాద్ ను మైక్రోసాఫ్ట్ ఎంచుకుందని చంద్రబాబు తెలిపారు. మిగితా రాష్ట్రాలు ఇచ్చే రాయితీల కంటే అదనంగా ఇస్తామని చెప్పామన్నారు. ఇంతగా శ్రమించిన తర్వాతే హైదరాబాద్లో ఐఎస్బీ పెట్టాలన్న కల సాకారమైందని తెలిపారు. అందరు పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరిచి ఐఎస్బీని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చామని వివరించారు చంద్రబాబు. ఇక మైక్రోసాఫ్ట్ వచ్చాకే హైదరాబాద్ లో ఐటీ విప్లవం ఊపందుకుందన్నారు.
అభివృద్ధికి చంద్రబాబు కొత్త ప్రతిపాదన ఇదే
ఇరవైఏళ్ల క్రితంనాటి హైదరాబాద్ నగరానికి.. ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు చంద్రబాబు. ఐటీ, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు. బయోటెక్నాలజీలో జినోమ్ వ్యాలీ కొత్త విప్లవం సృష్టించిందన్నారు. ఇప్పుడు తాను కొత్తగా ప్రతిపాదిస్తున్నది డెమొగ్రఫిక్ అడ్వాంటేజ్ అని చంద్రబాబు చెప్పారు.
యూరప్, జపాన్ లాంటి దేశాలు వృద్ధాప్యంలోకి చేరుకున్నాయన్నారు.ఇప్పుడు మనదేశంలో యువత అత్యధికంగా ఉన్నారని.. వారిని సరైన రీతిలో మలచుకోవాలని చంద్రబాబు సూచించారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రజల్లో అధిక శాతం తెలుగువారే ఉన్నారని చంద్రబాబు వివరించారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి మూడు స్థానాల్లో ఉంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications