కారు చౌకగా మోసాలు..! నగరంలో రెచ్చి పోతున్న సైబర్ కేటుగాళ్లు..!!
హైదరాబాద్ : విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మోసాలు కూడా బాగానే విస్తరిస్తున్నాయి. రకరకాల రూపాల్లో అనేక మోసాలు నగరవాసులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని మోసం చేసేందుకు మోసగాళ్లు చిత్ర విచిత్ర వేశాలు వేస్తున్నారు. ఒక మోసం ఆటకట్టించారు పోలీసులు అనుకునే లోపు మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తోంది. సామాన్య ప్రజానికం ఆశలు, కోరికలనే పెట్టుబడిగా ఈ కేటుగాళ్లు తమ దుకాణాలను తెరిచి విచ్చల విడి నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా పరిణమిస్తున్నారు. నగరంలో తాజాగా కారు చౌకగా కార్లు అందిస్తామని, లక్కీ లాటరీలో డబ్బు గెలుచుకున్నారంటూ అనేక మందిని సైబర్ మోసగాళ్లు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.
లక్కీ డ్రాలో డబ్బులు, చౌకగా కారంటూ మోసం..! పెరిగిపోతున్న సైబర్ నేరాలు...!!
కారు కావాలా..? డబ్బు తీసుకుంటారా..?.. అంటూ సైబర్ నేరస్థులు లక్కీ లాటరీతో మోసాలకు పాల్పడుతున్నారు. పలు కంపెనీల కార్లు బహుమతులుగా వచ్చాయని బాధితులను నమ్మిస్తున్నారు. కొద్ది నెలల నుంచి ఈ తరహా మోసాలు కొనసాగుతున్నా, నిందితులు ఎప్పటికప్పుడు పంథాను మార్చుకుని కొత్త బహుమతులు, రాయితీలంటూ లక్షల రూపాయల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. అతి చౌకగా 12.60 లక్షల టాటా సఫారీ వాహనం ఇస్తాం. లేదంటే 12.60లక్షల రూపాయలు తీసుకోండని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ రుసుం, రవాణా ఛార్జీల పేరుతో వసూలు చేసుకుంటున్నారు.
కోల్కతా నుంచి సైబర్ నేరస్థుల మాయ..! నమ్మి అడ్డంగా మోసపోతున్న నగర వాసులు..!!
కారు నిజంగానే వస్తుందన్న ఆశతో బాధితులు సైబర్ నేరస్థుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజా మోసాలు వెలుగులోకి వచ్చాయి. కారు లేదా డబ్బులొస్తాయంటూ ఆశపడి మోసపోయిన వారు నిత్యం వస్తున్నారని, నెలకు 30 నుంచి 40 ఫిర్యాలుదు వస్తున్నాయని పోలీసులు చెప్పుకొస్తున్నారు.
వరుస ఫిర్యాదులు..! పోలీసులకు సవాల్ గా మారిన కేసులు..!!
టాటా సఫారీ కార్ల పేరుతో మోసపోయామంటూ బాధితులు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. కోల్కతాలో ఉంటున్న మోసగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారని బాధితులకు వచ్చిన ఫోన్కాల్స్ ద్వారా తెలుసుకున్నారు. యాఖుత్పురాలో ఉంటున్న మహ్మద్ ఖలీల్ అనే వ్యాపారి నుంచి కేవలం వారం రోజుల వ్యవధిలో 1.88లక్షల రూపాయల నగదును బదిలీ చేసుకున్నారు. న్యూట్రిఫై ఆన్లైన్ షాపింగ్ కంపెనీ పేరుతో మహ్మద్ ఖలీల్కు పదిరోజుల క్రితం సంక్షిప్త సందేశం పంపించారు.
వాహనాలు లేదా డబ్బులు ఇస్తామంటూ మోసాలు..! నిలువు దోపిడీ చేస్తున్న మోసగాళ్లు..!!
టాటా సఫారీ కారు బహుమతిగా వచ్చిందని సంక్షిప్త సందేశంలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఖలీల్ ఫోన్ చేయగా, రెండు రోజుల్లో కారు పంపుతున్నామని తొలుత 6500 రూపాయలు చెల్లించాలని సూచించారు. 6500 రూపాయల నగదు జమ చేసిన అనంతరం 50వేల రూపాయలు కట్టాలన్నారు. వారం రోజుల్లో 1.88లక్షల రూపాయలను నిందితుల ఖాతాల్లో వేయించుకున్నారు. కారు ఎప్పుడొస్తుందని ఫోన్ చేయగా, నిందితుడి ఫోన్ పనిచేయలేదు. సైబర్ నేరస్థుల మాటలు విని మోసపోయానని గ్రహించిన ఖలీల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైబర్ క్రైమ్ నేరస్తుల వేటలో ఉన్నట్టు తెలుస్తోంది.