ఫలితాలతో జగన్ వెన్నులో వణుకు.. నిధులు అడగలేని పరిస్థితి: రామ్మోహన్ నాయుడు
ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కమలం వికసించింది. సో.. తెలుగు రాష్ట్రాలను ముడిపెట్టి మరీ విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ అయితే ఎన్నికలకుత వెళ్తారా లేదా అని అంటూంటే.. ఫలితాలతో సీఎం జగన్ దిమ్మదిరిగి పోయిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఫలితాలను చూసి ఏపీ సీఎం జగన్ భయపడుతారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్ చేశారు. ఫలితాలు ఏపీకి నష్టం చేకూరుస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.
ఫలితాలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి సీఎం జగన్ వెళ్తారని కామెంట్ చేశారు. ఆయన భయపడుతారని చెప్పారు. బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉంటారని చెప్పారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ పై ఉన్న కేసుల భయంతో రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో వైసీపీ ఎంపీలు అడగలేని పరిస్థితిలో ఉంటారని తెలిపారు.
విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు హక్కులపై 28 మంది ఎంపీలు ఉన్నా జగన్ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నా రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు పోరాటం చేయడం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల సాధనలో వైసీపీపై ఒత్తిడి తెచ్చి హామీలు గుర్తు చేస్తామన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కొరడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. పలు రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్న బీజేపీ ఏపీలో ఎందుకు బలపడడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బీజేపీ ప్రభావం తక్కువే ఉంటుందని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు వేరు అని వివరించారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం అధికారంలోకి వస్తామని కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు.