కీలక ఘట్టం: జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మొదలైంది. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ను పరేడ్ గ్రౌండ్ స్టేషన్లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శుక్రవారం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కేసీఆర్.. అనంతరం నగరానికి చేరుకుని మెట్రో మార్గాన్ని ప్రారంభించారు.
Recommended Video

11 కిలోమీటర్లు..
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని మొత్తం 11 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 9 స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
జూబ్లీ బస్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, సుల్తానా బజార్ తోపాటు రాష్ట్రంలోని అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఎంజీబీఎస్ వరకు ఈ మార్గంలో రైలు ప్రయాణికులను చేరవేస్తుంది.
అత్యంత ఎత్తైన మెట్రో స్టేషన్..
కాగా, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత ఎత్తయిన మెట్రో స్టేషన్గా జేబీఎస్ మెట్రో స్టేషన్ నిలవనుంది. దీన్ని ఐదంతస్తుల ఎత్తులో నిర్మించడం గమనార్హం. సికింద్రాబాద్ వైఎంసీ కూడలివద్ద గతంలో నిర్మించిన పైవంతెన ఉండటంతో దానికి సమాంతరంగా నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. దీంతో ఈ రెండు నిర్మాణాలపైన కారిడార్-2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో దీన్ని 53 అడుగుల ఎత్తులో నిర్మించకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు 5 అంతస్తులతో అత్యంత ఎత్తైన ట్రాక్పై మెట్రో రైలు ప్రయాణం ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
మరో రెండ్రోజుల్లో సేవలు..
అయితే మరో రెండ్రోజుల్లో ప్రయాణికులను ఈ మార్గంలో అనుమతించే అవకాశం ఉంది. దీంతో నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఈ మార్గం ఉండనుంది. ఇప్పటికే ప్రారంభించిన అన్ని మార్గాల్లోనూ ప్రయాణికులు మెట్రోను ఉపయోగించుకుంటున్నారు. దేశంలో మంచి లాభాల్లో నడుస్తున్న మెట్రోల్లో హైదరాబాద్ మెట్రో కూడా ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications