కమీషన్ల మీద ధ్యాస.. రైతులపై కాదు, కేసీఆర్పై రాములమ్మ నిప్పులు
యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దమే జరిగింది. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. యాసంగి పంట కొనుగోలు చేస్తామని ప్రకటన చేశారు. దీంతో రైతులు ఆనంద పడుతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా స్వాగతించాయి. కానీ బీజేపీ మాత్రం విరుచుకుపడుతూనే ఉంది. అన్నదాతల ఊసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తింది.

విజయశాంతి విసుర్లు
సీఎం కేసీఆర్ పై బీజేపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు దిగారని ఆమె ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో కేసీఆర్లో వణుకు మొదలైందని చెప్పారు. ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా, సమస్యలపై తనను నిలదీయకుండా దొంగ ధర్నాలు షురూ చేశాడని విమర్శించారు.

అబద్దాల కోరు
కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని, తన రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నాడని విమర్శించారు. కమీషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రాలు తిరగడానికి, ఎన్నికల కోసం పార్టీకి వ్యూహకర్తలను నియమించుకోవడానికి డబ్బులు ఉంటాయి అని విమర్శించారు.

కేసీఆర్ కుమ్మక్కు
మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని వివరించారు. పాకిస్థాన్, శ్రీలంక కన్నా తెలంగాణ అప్పులే ఎక్కువని విజయశాంతి వివరించారు. కానీ ఆయన జిమ్మిక్కులు చేస్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ చెప్పే మాయమాటలను నమ్మే స్థితిలో జనం లేరని చెప్పారు. అబద్దాలు అని ప్రజలకు తెలిసిపోయిందని వివరించారు.

యాసంగి ధాన్యం కొంటాం
అంతకుముందు మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications