తెలంగాణ వాళ్లపై అంతమాటా, గెలిపించిన వారినే తీవ్రంగా అవమానించిన కేసీఆర్: రాహుల్ గాంధీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, కేసీఆర్ అందరినీ నమ్మించి మోసం చేసారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గద్వాల బహిరంగ సభలో అన్నారు. కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. దేశంలో మోడీ రాజ్యం, తెలంగాణలో టీఆర్ఎస్ఎస్గా మారిందని విమర్శించారు.
తెరాసకు, నరేంద్ర మోడీకి మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆదాయంలో 20 శాతం విద్యకు కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు మెచ్యూర్ కాలేదని కేసీఆర్ చెబుతున్నారని, తద్వారా ఇక్కడి వారిని ఆయన అవమానించారన్నారు.

ఖావో కమీషన్ రావు అని పేరు పెట్టారు
అయిదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ వస్తుందని భావించారని, అందుకు ఇక్కడి ప్రజలు కలలు కన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని భావించారన్నారు. నాలుగేళ్ల క్రితం కన్న కలలు అన్నీ కల్లలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు అని జనం పేరు పెట్టారని ఎద్దేవా చేశారు.

అందరిపై అప్పుభారం మోపారు
నాలుగున్నరేళ్లలో తెలంగాణపైలక్షన్నర కోట్ల అప్పు భారం మోపారని రాహుల్ గాంధీ అన్నారు. నేడు ప్రతి తెలంగాణ పౌరుడి పైన రూ.లక్షన్నర అప్పు ఉందని చెప్పారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆస్తులు మాత్రం నాలుగు రెట్లు పెరిగాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. రైతులు, గిరిజనుల భూముల రక్షణ కోసం యూపీఏ ప్రభుత్వం ఓ చట్టం తీసుకు వచ్చిందని చెప్పారు. రైతుల అనుమతి లేకుండా భూములు తీసుకోవద్దని, తీసుకుంటే నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలన్నారు.

రైతులకు బేడీలు వేశారు
కేసీఆర్ ప్రభుత్వం ఆ చట్టాలను తుంగలో తొక్కిందని రాహుల్ గాంధీ అన్నారు. తాను ఓడిపోతే ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ఓడిపోతే రూ.300 కోట్ల ఇంట్లో రెస్ట్ తీసుకుంటారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.10వేల కోట్లతో పాలమూరు - రంగారెడ్డి జిల్లాకు డిజైన్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం రూ.60వేల కోట్లకు పెంచిందన్నారు. 22 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ కనీసం ఐదువేలు ఇవ్వలేదన్నారు. ప్రజలకు సొంతింటి కలను తాము నిజం చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే బేడీలు వేశారన్నారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందన్నారు.

బీజేపీకి అండగా కేసీఆర్
భారతదేశంలో రెండో రెండు రాజకీయ గ్రూపులు ఉన్నాయని, ఓ వైపు నరేంద్ర మోడీ, మరోవైపు కాంగ్రెస్ ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితిలు ఓ వైపు ఉంటే, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ మాత్రం మరోవైపు ఉందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో.. ఇలా అన్ని సమయాల్లో కేసీఆర్ బీజేపీకి అండగా నిలబడ్డారని చెప్పారు. అవిశ్వాసం తీర్మానం సమయంలోను పరోక్షంగా మద్దతిచ్చారన్నారు.












Click it and Unblock the Notifications