వరి కొంటర..? కొనర..? రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్ బృందం, రైతులకు అభినందనలు
యాసంగిలో ధాన్యం కొనుగోలు అంశం గురించి కేంద్రం ప్రభుత్వంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఆయన ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు గురించి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించిన విధంగానే తెలంగాణ నుంచి సేకరించనున్నందున.. సంవత్సరం టార్గెట్ ఇవ్వాలని కోరారు. అలా రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు.
ఢిల్లీకి పయనం
ధర్నా చేపట్టిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం అనే ప్రకటన వచ్చింది. కానీ ప్రయత్నం కాలేదు. దీంతో చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నామని కేసీఆర్ వివరించారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు డెలిగేషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, సివిల్ సప్లయ్ సెక్రటరీ అధికారులు మంత్రిని, అధికారులను కలుస్తారని వివరించారు. అవసరమైతై ప్రధాన మంత్రిని కలిసి డిమాండ్ చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.
రైతులు కన్ఫ్యూజన్
ఏదో ఒకటి తేల్చకపోతే రైతుల కన్ఫ్యూజన్లో ఉంటారని కేసీఆర్ వివరించారు. ముందే చెబితే రైతులు వేరే పంట వేసుకుంటారు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు మీద మాట్లాడుతామని, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినట్లు వార్త వచ్చింది. మరి అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని కేసీఆర్ వివరించారు. దీనికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి ఏ విషయం అనేది తెలుపుతామని సీఎం కేసీఆర్ అన్నారు.
రైతులు విజయం సాధించారు
వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడాన్ని కేసీఆర్ స్వాగతించారు. సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలియజేశారు. రైతులపై దేశద్రోహుల కేసులు పెట్టారని.. అవీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తూ 700 మంది రైతులు ఆత్మార్పణ చేసుకున్నారని గుర్తుచేశారు.వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతులు కనీస మద్దతు ధర మాత్రమే అడుగుతున్నామని చెప్పారు.
15 కోట్ల మంది రైతుల డిమాండ్
పంటకు మద్దతు ధర ఇవ్వాలని దేశంలోని రైతులు అందరూ కోరుతున్నారని వివరించారు. 15 కోట్ల మంది రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కనీస మద్దతు ధరపై బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశంలో పెట్టాలని కేసీఆర్ కోరారు. దీనికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని కేసీఆర్ తన వైఖరిని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.