అంతా మీరే చేశారు.. అమరీందర్ సింగ్ వల్లే పంజాబ్లో ఇలా: భట్టి విక్రమార్క
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్నులొట్ట బోయినట్టుంది. ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఇక విపక్షానికే పరిమితం అయ్యింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. నెపం మాజీ సీఎం అమరీందర్ సింగ్పై నెడుతున్నారు. రణదీప్ సుర్జేవాలా కామెంట్ చేయగా.. ఇప్పుడు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంతు వచ్చింది.
అధికారంలో ఉన్న పంజాబ్లో ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉందన్నారు. రోగం ముదిరాక మందు వేసినట్టుందని కామెంట్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భట్టి పేర్కొన్నారు.
పంజాబ్ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు తేడా ఉందని గుర్తుచేశారు. పంజాబ్ ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ఏ మాత్రం ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తప్ప.. విభేదాలు లేవని స్పష్టంచేశారు. ఇప్పుడే కాదు గతంలో కూడా తమ వద్ద భిన్నాభిప్రాయాలు ఉండేవని.. మరీ అప్పడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా అని అడిగారు.
వాస్తవానికి పంజాబ్లో చక్రం తిప్పాలని సిద్దూ అనుకున్నాడు. తమ పార్టీ విజయం తథ్యం అని అంచనా వేశారు. కానీ సిద్దూ వల్లే కాంగ్రెస్ ప్రభ తగ్గిందని విశ్లేషకులు అంటారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అమరీందర్తో పడలేదు. గత సెప్టెంబర్లో రాజీనామా కూడా చేసి హల్ చల్ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమరీందర్ సింగ్ను సీఎం పదవీ నుంచి తప్పించారు. అప్పుడు పీసీసీ చీఫ్గా కొనసాగుతోన్న.. సీఎం పోస్టుపై మనసు ఉండేంది. ఇంతలో చన్నీని సీఎం చేయడంతో మింగలేక కక్కలేని పరిస్థితి. అలా ఎన్నికలకు వచ్చి.. గెలుద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారు. కానీ అపజయాన్ని మాత్రం కొందరు కాంగ్రెస్ నేతలు అమరీందర్పై రుద్దుతున్నారు.