తేల్చేసిన జానారెడ్డి... ఆ విషయంలో రాహుల్ వచ్చి చెప్పినా వినేది లేదంటూ...
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తాను పోటీ చేసేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తేల్చేశారు. తన కుమారుడు రఘువీర్ రెడ్డి ఉపఎన్నికలో పోటీ చేస్తాడని చెప్పారు. మరో రెండేళ్లలోనే సాధారణ ఎన్నికలు ఉండటంతో ఉపఎన్నికలో పోటీ చేస్తే ఆసక్తి లేదన్నారు. ఈ విషయంలో తన నిర్ణయం మారదని... రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా సరే ఉపఎన్నికలో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన... ఆ అవసరం తనకు లేదన్నారు. ఆ ప్రచారం మీడియా సృష్టించిందే తప్ప తనకే సంబంధం లేదన్నారు.టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పార్టీ చూసుకుంటుందన్నారు.

జానారెడ్డితో బీజేపీ సంప్రదింపులు...?
ఇటీవల నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ నాగార్జునసాగర్లోనూ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చునన్న ప్రచారం జరిగింది. నాగార్జునసాగర్ జానారెడ్డికి కంచుకోట కావడంతో ఇక్కడినుంచి ఆయన్ను గానీ ఆయన కుమారుడిని గానీ బరిలో దింపాలనే యోచనతో బీజేపీ వారితో సంప్రదింపులు జరిపిందన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా జానారెడ్డి ఇచ్చిన క్లారిటీతో ఈ ఊహాగానాలకు తెరపడినట్లే.

ఆశావహుల ఆశలపై నీళ్లు..
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తన కుమారుడు రఘువీర్ పోటీ చేస్తాడని జానారెడ్డి చెప్పడం... కాంగ్రెస్ తమ ఉపఎన్నిక అభ్యర్థిని దాదాపుగా ప్రకటించుకున్నట్లే లెక్క. జానారెడ్డిని కాదని కాంగ్రెస్ అధిష్టానం అక్కడ మరొకరికి టికెట్ ఇచ్చే సాహసం చేయలేదు. జానారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో కొంతమంది ఆశావహులు ఉపఎన్నిక టికెట్పై ఆశలు పెట్టుకున్నప్పటికీ... అలాంటిదేమీ లేదని స్పష్టత ఇవ్వడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

బీజేపీ ప్రయత్నాలు...
నిజానికి నాగార్జునసాగర్లో బీజేపీకి బలం లేదనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డికి కేవలం 2675 ఓట్లు మాత్రమే వచ్చాయి. దుబ్బాక,జీహెచ్ఎంసీ తరహాలో నాగార్జునసాగర్లో అద్భుతాలు చేయడం అంత సులభం కాదనే వాదన కూడా ఉంది. అందుకే ఆ జానారెడ్డి లేదా ఆయన కుమారుడిని బీజేపీలోకి లాగాలని ఆ పార్టీ ప్రయత్నించిందన్న వాదన ఉన్నది. అయితే అటువైపు నుంచి విముఖత ఎదురుకావడంతో మరో బలమైన అభ్యర్థి వేటలో ఆ పార్టీ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. రెడ్డి లేదా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపే యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications