తాగండి.. చావండి.. ఖజానా నింపండి.. కేసీఆర్పై జగ్గారెడ్డి ఫైర్..
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏ అంశం ఎత్తుకోవాలో అర్థం కాక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవారు బఫూన్లు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలను తాజాగా కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. అహంకారమే కేసీఆర్ పతనానికి దారి తీస్తుందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

తిన్నింటి వాసాలు లెక్కబేట్టే వ్యక్తి..
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్లోనే అని... తిన్నింటి వాసాలు లెక్కబెట్టేలా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ రైతు దీక్షను తట్టుకోలేకనే కేసీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్లో కేసిఆర్ ఉన్నట్టు రైతులందరూ సంతోషంగా లేరని అన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే తీవ్ర పదజాలంతో అవమానిస్తారా అని మండిపడ్డారు.

తాగండి.. చావండి.. ఖజానా నింపండి.. జగ్గారెడ్డి ఎద్దేవా..
సోనియాను ఒప్పించి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ నాయకులు బఫూన్లు అయ్యారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎం పీఠం నుంచి దిగిన మరుక్షణం కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట ఉండరని విమర్శించారు. పదవిపోతేకానీ ఆయన పరపతి ఏంటో బయటపడుతుందన్నారు. రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్ చేసి.. 'తాగండి, చావండి, ఖజానా నింపండి' అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలు కదపకుండా ప్రగతి భవన్లో కూర్చుంటే క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు, వాస్తవాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అర్థం లేని మాటలతో కేసీఆరే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

విమర్శలను తిప్పికొట్టిన వీహెచ్
ఛత్తీస్ఘడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదన్న ఆరోపణలను ఖండించారు. అక్కడి రైతులకు ప్రభుత్వం రూ.11వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. అలాగే 85లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కంటే కేసీఆర్కు మద్యం ఆదాయం మీదే ప్రేమ ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ విమర్శలను తాము పట్టించుకోమని.. తామెప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని,ప్రజల గొంతునే వినిపిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications