coronavirus: మరో 2 పాజిటివ్, తెలంగాణలో 18కి చేరిన కరోనా కేసులు, 6 ల్యాబ్లు: మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరో ఇద్దరికీ వైరస్ సోకిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధృవీకరించారు. వైరస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స కంటే ముందుజాగ్రత్త చర్యలే కీలకం అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. వైరస్ను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన ఇటలీలో కరోనా ప్రభావం ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. తగిన చర్యలు తీసుకోకపోవడంతో వైరస్ ఆవిర్భవించిన చైనాను మించి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.
విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా వైరస్ సోకిందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని తేల్చిచెప్పారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. కరోనా వైరస్ కోసం ఆరు ల్యాబ్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే రూ.500 కోట్లు కేటాయించినందున... ప్రణాళికతో సోకిన వైరస్ను సమూలంగా నిర్మూలిస్తామని వెల్లడించారు.
Recommended Video
హైదరాబాద్కు విమానాల్లో వచ్చిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని చెప్పారు. కరీంనగర్కు ఇండోనేషియా నుంచి రైలు మార్గం ద్వారా కొందరు వచ్చారని తెలిపారు. వారు దేశంలోని ఏ ఎయిర్పోర్టులో దిగారో తెలియదు కానీ.. రామగుండం వరకు రైల్లో వచ్చారని.. అక్కడినుంచి కారులో వచ్చారని పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో అందరికీ వైద్య పరీక్షలు చేశామని తెలిపారు. శుక్రవారం మరో రెండు కేసులను గుర్తించామని.. మొగ్గ దశలోనే వైరస్ను అరికట్టేందుకు 15 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు పేర్కొన్నారు.