Coronavirus effect: రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలు ఐదు రేట్లు పెంపు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 50కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
సికింద్రాబాద్ సహా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనావ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగా రద్దీని తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
పెంచిన ధరలు మార్చి 18 నుంచి అమల్లోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ కూడా పెంచిన ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాగా, మనదేశంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మనదేశంలో 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనావైరస్ సోకి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. మనదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137కు చేరిందని, ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 36 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఆ తర్వాత 24 కరోనా పాజిటివ్ కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 కేసులు నమోదయ్యాయి.