Coronavirus: పరిస్థితిని తెలుసుకునేందుకు హైదరాబాదుకు కేంద్ర బృందం
హైదరాబాదు: హైదరాబాదులో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయన్న వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దీంతో నివేదిక తీసుకునేందుకు కేంద్ర బృందం హైదరాబాదుకు రానుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితులను ఎలా డీల్ చేయనుందో అనే అంశాన్ని తెలుసుకునేందుకు కేంద్ర బృందం హైదరాబాదుకు రానుంది. అంతేకాదు వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బృందం సూచించనుంది.
ఇక కేంద్రం నుంచి వస్తున్న బృందంలో నేషన్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ నుంచి ఎపిడెమాలజిస్టు కూడా ఉంటారు. హైదరాబాదుకు చేరుకోగానే బృందం నేరుగా గాంధీ హాస్పిటల్కు వెళుతుంది. అనంతరం రాష్ట్ర ఆరోగ్యశాఖతో భేటీ అయి వైరస్ నివారణపై చర్చిస్తుంది. చైనా, హాంగ్కాంగ్ల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులను ఆయా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో హైదరాబాదు కూడా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాదుకు వచ్చిన ఓ వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో అలర్ట్ అయ్యింది కేంద్రం. సోమవారం రోజున బృందాన్ని ఆయా నగరాలకు పంపిస్తామని శనివారం కేంద్రమంత్రి హర్ష వర్ధన్ చెప్పారు.
Recommended Video
ఇదిలా ఉంటే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్కు వెళ్లగా పరీక్షల్లో నెగిటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. చైనా నుంచి డిసెంబర్లో నగరానికి వచ్చిన మరో వ్యక్తిని వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. అతని రక్తపు నమూనాలు సేకరించి పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపడం జరిగింది. ఇదిలా ఉంటే చైనా, హాంగ్కాంగ్ నగరాల నుంచి వచ్చే వారిపై గట్టి నిఘా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ క్షుణ్ణంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది.