coronavirus:కరోనా ఫ్రీ తెలంగాణ, 24/7 కంట్రోల్ రూం, అందరూ ‘గాంధీ’కే వద్దు..
హైదరాబాద్: కరోనావైరస్ అనుమానం ఉన్న వారందరూ గాంధీ ఆస్పత్రికే రావాల్సని అసవరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రంతో సంప్రదించి అన్ని వసతులున్న ప్రైవేటు ఆస్పత్రులకు కూడా కరోనా వైద్య చికిత్సకు అనుమతులిచ్చామని తెలిపారు. అక్కడే శాంపిల్స్ తీసుకుని గాంధీ ఆస్పత్రికి రావచ్చని అన్నారు. టెస్టులు మాత్రం ల్యాబ్స్లో జరుగుతాయన్నారు.

ముందుకొచ్చిన ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులు..
కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలను అసోలేషన్ వార్డుల కోసం సంప్రదించామని.. అయితే వారు ట్రీట్మెంట్ కూడా ఇస్తామంటూ ముందుకు వచ్చారని మంత్రి ఈటెల తెలిపారు. మహావీర్, అపోలో, ప్రతిమ, చెల్మెడ లాంటి ఆస్పత్రులు ముందుకు వచ్చాయన్నారు. 50 బెడ్ల సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. కింగ్ కోటి, ఎంసీహెచ్, మిలిటరీ ఆస్పత్రుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

24/7 కమాండ్ కంట్రోల్ రూం..
తన ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సీఎస్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయూష్ కమిషనర్లు ఇక్కడే ఉంటారని చెప్పారు. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే తాము 24/7 ఇక్కడే ఉండి మానిటర్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే సీఎం నిధులు ఏర్పాటు చేశారన్నారు. కరోనాపై తక్షణ చర్యల కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
హాస్పిటల్ మేనేజ్ మెంట్ కమిటీ, సర్వెలెన్స్ కమిటీ, ఐఈసీ కమిటీ, ప్రొక్యూర్మెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిపుణులు, అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నామని చెప్పారు.

కరోనాపై ఆందోళన వద్దు..
కరోనావైరస్పై వస్తున్న వదంతులు నమ్మవద్దని మంత్రి ఈటెల తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కొందరు తమ స్కూళ్లను బంద్ చేస్తున్నారని అన్నారు. అయితే ఆ అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగితెలుసుకుంటున్నారని చెప్పారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

కరోనా ఫ్రీ తెలంగాణ..
మిగితా వైరస్ల కన్నా కరోనా తక్కువ ప్రభావం కలదని, చనిపోయే ప్రమాదం కూడా లేదని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. బుధవారం 20 కరోనా అనుమానిత కేసులు వచ్చాయని, వారి ల్యాబ్ రిపోర్టులు గురువారం వస్తాయన్నారు. కరోనా వైరస్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఉండాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. నిధుల కొరత లేదన్నారు. కమాండ్ కంట్రోల్ రూం గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

కరోనా కేసులు కేంద్రమే.. మాస్కులు కోరాం..
కరోనా కేసులను కేంద్రం మాత్రమే ప్రకటిస్తుందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
సాధారణ మాస్కులు తమ వద్ద తగినంత ఉన్నాయని, 50వేల హెచ్1ఎన్1 మాస్కులు కావాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని, నిధుల గురించి ఆలోచించవద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. కరోనా వ్యాపించకుండా ఉండాలంటే.. కరోనా అనుమానిత వ్యక్తులు తుమ్మినా దగ్గినా తువాలు అడ్డుపెట్టుకోవాలని, చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని మంత్రి జాగ్రత్తలు తెలిపారు. సరైన శానిటేషన్ జాగ్రత్తలు తీసుకుంటూ క్యూర్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications