disha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి
హైదరాబాద్: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ వివరాలను శుక్రవారం మీడియాకు తెలియజేశారు. దిశ ఘటన కేసులో అన్ని కోణాల్లో విచారించామని ఆయన తెలిపారు. రూమర్లు ప్రచారం చేయొద్దని కోరారు.
Recommended Video

చట్టం తనపని తాను చేసింది..
దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్పై పలు అనుమానాలున్నాయని, జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ ఎన్కౌంటర్ ఘటనను సుమోటోగా తీసుకుందని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

నిందితులు అటూ ఇటూ తిప్పారు..
శుక్రవారం తెల్లవారుజామున కేసు రీ కన్స్ర్టక్చన్ కోసం నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులను.. బాధితురాలిని హత్య చేసిన చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చామని సీపీ తెలిపారు. ఆ సమయంలో నిందితులు బాధితురాలికి చెందిన వస్తువులను అక్కడ పెట్టామని ఇక్కడ పెట్టామంటూ తిప్పారని చెప్పారు.

దిశ వాచీ, సెల్ఫోన్ గుర్తింపు.. కర్రలు, రాళ్లతో నిందితుల దాడి..
ఆ తర్వాత అక్కడ నిందితులు పాతిపెట్టిన బాధితురాలికి సంబంధించిన సెల్ఫోన్, పవర్ బ్యాంక్, వాచీని పోలీసులు గుర్తించారని సీపీ తెలిపారు. అయితే, ఆ సమయంలోనే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఓ పోలీసు వద్ద ఉన్న తుపాకీని ప్రధాన నిందితుడు ఆరిఫ్ లాక్కున్నాడని తెలిపారు.

లొంగిపోవాలని కోరినా..
అనంతరం పోలీసులు లొంగిపోవాలని నిందితులను కోరినా వారు వినలేదని సీపీ తెలిపారు. కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల తర్వాత పోలీసులు కాల్పులు ఆపేసి వెళ్లి చూడగా.. నిందితులంతా చనిపోయారని తెలిపారు.

ఎస్ఐ, కానిస్టేబుల్కు గాయాలు
నిందితులకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలోనే తెల్లవారుజామున ఘటనా స్థలానికి తీసుకెళ్లామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో సుమారు 10 మంది వరకు పోలీసులు ఉన్నారని తెలిపారు. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి 6.50గంటల వరకు ఈ ఘటన జరిగిందన్నారు. నిందితులు జరిపిన దాడిలో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ గాయపడ్డారని చెప్పారు. వారు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే, పోలీసులకు బుల్లెట్ గాయాలు కాలేదని, నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయని తెలిపారు.

రూమర్స్ ప్రచారం చేయొద్దు..
నిందితులు గతంలో కూడా నేరాలు చేసినట్లు అనుమానాలున్నాయని.. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ దర్యాప్తు జరుపుతున్నామని సీపీ తెలిపారు. ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని సీపీ సజ్జనార్ మీడియాకు సూచించారు. బాధితురాలి పేరు, ఆమె కుటుంబసభ్యుల వివరాలను వెల్లడించవద్దని కోరారు. ఈ కేసుకు సంబంధించి తాము చెప్పిన తర్వాతే ఏదైనా వార్తలు ప్రచారం చేయాలని సీపీ కోరారు. నిమిష నిమిషానికి.. గంటగంటకూ ఏం అప్డేట్ ఉంటుందన్నారు.

వరంగల్ ఎన్ కౌంటర్పై స్పందించేందుకు నిరాకరణ
వరంగల్ ఎన్కౌంటర్ ఘటనపై ప్రశ్నలడిగిందేకు ఓ మీడియా ప్రతినిధి ప్రయత్నించగా.. అందుకు సీపీ నిరాకరించారు. దిశ కేసులో అన్ని ఆధారాలు సేకరించామని, కొన్ని ఆధారాల రికవరీ కోసమే నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి తీసుకొచ్చామని తెలిపారు.

నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
నిందితులు నవంబర్ 27న దిశపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని సీపీ సజ్జనార్ తెలిపారు. 28న నిందితులను అరెస్ట్ చేశామని, నవంబర్ 30కి చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు. నిందితులు నలుగురు కూడా నారాయణపేట జిల్లాకు చెందినవారని తెలిపారు. కాగా, నిందితుల మృతదేహాలకు శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితుల మృతదేహాలను వారి ఇళ్లకు కాకుండా నేరుగా స్మశానానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications