డిగ్రీ, ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ వాయిదా, టీఎస్ పీఈసెట్ కూడా.. ఎందుకంటే
గులాబ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో జరుగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఇటు టీఎస్ పీఈసెట్ -2021 ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ మేరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న నిర్వహించాల్సిన టీఎస్ పీఈసెట్ ప్రవేశపరీక్షను వాయిదా వేస్తున్నామని అందులో వివరించారు. ఈ పరీక్షను అక్టోబర్ 23న నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సెంటర్లలో ఎటువంటి మార్పు ఉండదని.. ఇప్పటికే జారీచేసిన హాల్ టికెట్లనే పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 28,29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కూడా వాయిదా వేశారు. 28, 29 తేదీల్లో భారీ వర్ష సూచన ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. 30 తేదీ జరగాల్సిన పరీక్ష యధావిధిగా జరుగుతుందని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల నిర్వహణ తేదీలపై మంగళ, బుధవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఉస్మానియా వర్సిటీ పరిధిలో.. వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 19, 20వ తేదీల్లో మాత్రమే వాయిదా పడింది. ఆ రోజుల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉన్నవారికి తర్వాత నిర్వహిస్తామని కూడా తెలియజేశారు. అయితే చివరి క్షణంలో తెలియజేయడంతో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.