Hyderabad: హైదరాబాద్ లో పెరుగుతోన్న డెంగీ కేసులు..
వర్షకాలం రాక ముందే జ్వరాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే డెంగీ కేసులు రావడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. నగరంలో మే నుంచే ఇప్పటిదాకా100కు పైగా కేసులు వచ్చాయని తెలుస్తోంది. ఒక్క నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 29 డెంగీ కేసులు నమోదయ్యాయి. సిటీలో మొత్తంగా 40 వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో వర్షాల ఎక్కువగా కురిసేటప్పుడు డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతాయి. మే నుంచే కేసులు రావడంతో ఈసారి భారీగా కేసులు వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు.
డెంగీ కేసులు నమోదు కావడంతో జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యశాఖ అధికారులు, బల్దియా ఎంటమాలజీ అధికారులు పీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెంగీ ర్యాపిడ్ కిట్లతో పాటు, మందులు సిద్ధంగా ఉంచుతున్నారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం కూడా సిటీలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి నీరు నిల్వ ఉండే ప్రాంతలను గుర్తించి యాంటీ లార్వా, ఫాగింగ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఒక్క కేసు నమోదైతే డెంగీ బారిన పడిన వ్యక్తి ఇంటి చుట్టూ 50 ఇండ్లకు యాంటీ లార్వా, ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంది. వానాకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. లేదంటే డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. ఇళ్లలో ఉండే ట్యాంకులను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, ట్యాంకులు, డ్రమ్ములపై మూతలు ఉండేలా చూసుకోవాలన్నారు.
కూలర్లు, టైర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉంచుకొవద్దన్నారు.
వారానికి ఒకసారి ఫ్రై డే- డ్రై డే పేరుతో పాత్రలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాను క్లీన్ చేసుకోవాలని సూచించారు. డెంగీ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, జ్వరం వస్తే స్థానిక బస్తీ దవాఖాలు, యూపీహెచ్సీల్లో టెస్టులు చేయించుకోవాలని వివరిస్తున్నారు. అయితే అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు కావని, ఎక్కువ శాతం సాధారణ జ్వరాలే ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications