రాంగోపాల్ వర్మ 'దిశ' సినిమాను ఆపేయండి... హైకోర్టులో బాధితురాలి తండ్రి పిటిషన్...
యావత్ దేశాన్ని కుదిపేసిన దిశ హత్యాచార ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం,సెన్సార్ బోర్డులను ఆదేశించాలని దిశ తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిశ హత్యాచార ఘటన,నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు.
త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న న్యాయమూర్తి...
ఈ పిటిషన్పై న్యాయమూర్తి పి.నవీన్ రావు శుక్రవారం(అక్టోబర్ 9) విచారణ చేపట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరుపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావును కోర్టు ప్రశ్నించగా... కేంద్ర ప్రభుత్వం,సెన్సార్ బోర్డు చర్యలను కనుక్కొని వివరిస్తామని తెలిపారు. ఇందుకోసం కోర్టు అనుమతితో కొంత సమయం తీసుకున్న సొలిసిటర్ జనరల్... కాసేపటికి తిరిగి న్యాయస్థానంలో హాజరయ్యారు. సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కేంద్ర ప్రభుత్వానికి లేదా సెన్సార్ బోర్డుకు ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని న్యాయమూర్తికి వెల్లడించారు.సొలిసిటర్ జనరల్ వివరణపై స్పందించిన న్యాయమూర్తి... ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం,సెన్సార్ బోర్డు దిశ తండ్రి ఇచ్చే పిటిషన్పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
దిశ హత్యాచారం...
గతేడాది నవంబర్ 27వ తేదీ రాత్రి షాద్ నగర్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద దిశపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. అత్యాచారం అనంతరం ఆమెను హత్య చేసి... రంగారెడ్డి జిల్లా చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు డెడ్ బాడీని తరలించారు. అక్కడే డెడ్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేసులో నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు... IPC సెక్షన్ 302, 375, 362 కింద కేసులు నమోదు చేశారు.
Recommended Video
నిందితుల ఎన్కౌంటర్
ఇదే క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా డిసెంబర్ 6,తెల్లవారుజామున 5.10గంటలకు దిశ నిందితులను పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితులు ఒక్కసారిగా తమపై తిరగబడటంతో నలుగురినీ ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యాచార ఘటన వెలుగుచూసిన 10 రోజుల వ్యవధిలోనే నిందితులు ఎన్కౌంటర్లో మరణించడం గమనార్హం. అప్పట్లో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ యధార్థ సంఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ 'దిశ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన వర్మ... నవంబర్ 26న సినిమా విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని దిశ తండ్రి కోర్టును ఆశ్రయించారు.