ఏపీ ఎన్నికల వేళ స్టీఫెన్ రవీంద్రపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు
సైబరాబాద్ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్ ఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు అందింది. కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఈ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్న సమయంలో భూ వివాదంలో జోక్యం చేసుకున్నానంటూ స్టీఫెన్ రవీంద్ర తనను సస్పెండ్ చేశారని తెలిపారు.
శంకర్ పల్లి జన్వాడ భూ కబ్జాదారులతో ఆయన చేయి కలిపి, తనపై ఎటువంటి విచారణ చేయకుండానే సస్పెండ్ చేశారని ఆరోపించారు. తన సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా ఓ పెళ్లికి పిలిచి డీసీపీ వెంకటేశ్వర్లు అందించారన్నారు. రవీంద్ర వల్ల తాను ఏడాది సమయం నష్టపోయానని, అతనిపై చర్యలు తీసుకోవాలని గంగాధర్ కోరారు.

సస్పెండ్ వల్ల తాను ప్రమోషన్ అవకాశం కోల్పోయానని గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రమోషన్ కల్పించే అవకాశాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు ఆదేశించినప్పటికీ న్యాయస్థానం ఉత్తర్వులను స్టీఫెన్ లెక్కచేయలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తననే కాదని పలువురు కిందిస్థాయి అధికారులను కూడా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టారంటూ ఫిర్యాదు కాపీలను చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖకు, డీవోపీటీకి పంపించారు.
స్టీఫెన్ రవీంద్ర ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీకి తీసుకువెళ్లాలనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అంగీకరించింది. ఐజీ హోదాలో ఉన్న రవీంద్రకు కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ గా ప్రమోషన్ కల్పించింది. హోంగార్డుల సంక్షేమం చూస్తున్న స్టీఫెన్ కు ప్రమోషన్ సమయంలో పోలీసు క్రీడలు, సంక్షేమం బాధ్యతలను ప్రభుత్వం అదనంగా అప్పగించింది.












Click it and Unblock the Notifications