ప్రచారంలో నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో నిబంధనలు అతిక్రమిస్తే సహించే ప్రసక్తేలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పర్యావరణహితంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించింది. ఎన్నికల ప్రచారంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఈసీ.. అలాంటి సామాగ్రిని ప్రచారంలో ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. క్యాంపెయినింగ్ ప్లాస్టిక్, పాలిథిన్ వంటివి వాడకూడదని, బయో డీగ్రేడబుల్ టీరియల్ మాత్రమే వాడాలని సూచించింది. సాధారణంగా రాజకీయ పార్టీ క్యాంపెయినింగ్ సందర్భంగా ప్లాస్టిక్ తో తయారుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, పాంప్లెట్లు, జెండాలు తదితర వస్తువుల్ని ఉపయోగిస్తాయి. వీటికి బదులుగా పర్యవరణహితమైన వస్తువులనే ప్రచారంలో ఉపయోగించాలని సూచించింది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
లోక్సభ ఎన్నికలు 2019 : ఓటుకు 5 రకాలుగా చోటు
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని ఈసీ స్పష్టం చేసింది. నిబంధనల మేరకు అభ్యర్థులు హెలికాప్టర్లు వినియోగించుకోవచ్చని చెప్పింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు ఉపయోగించవద్దని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ప్రచారంలో భాగంగా నేతలు చేసే ప్రసంగాల్లో ఉపయోగించే భాష విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. రాజకీయ నాయకులు ప్రచారంలో అసభ్య పదజాలం ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు
నాయకులు ప్రచారాల సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని, ప్రార్థనా మందిరాల్లో ప్రచారం నిర్వహించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దేశ రక్షణ, సైన్యానికి సంబంధించిన అంశాలను ప్రసంగాల్లో ప్రస్తావించవద్దని చెప్పింది. గవర్నమెంట్ ఆఫీసుల గోడలపై రాతలు, పోస్టర్లు అతికించడంపై నిషేధం ఉన్న విషయాన్ని రజత్ కుమార్ గుర్తు చేశారు. కోడ్ ఉల్లంఘించినట్లు రుజువైతే విజయం సాధించిన అభ్యర్థులుపై అనర్హుత వేటు పడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంపై దృష్టి
వివిధ పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇందుకోసం ఐటీ నిపుణుడు మాధవాచారి నేతృత్వంలో ఎంసీఎంసీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ కమిటీ సోషల్ మీడియాలో చేస్తున్న క్యాంపెయినింగ్ గురించి పరిశీలించి నివేదికలు రూపొందించనుంది.
విధుల్లో ఉన్న సిబ్బందికి ఓటు వేసే ఛాన్స్
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఈసారి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ విధానాన్ని అణల్లోకి తెచ్చిన ఈసీ.. విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈవీఎంలో ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించింది. అయితే సొంత పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ను ప్రిసైడింగ్ అధికారికి చూపించి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు.