క్లీన్ పాలిటిక్స్: భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీదే భాగ్యనగరం: బండి సంజయ్ నోట వైఎస్ పేరు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చెమటలు పట్టించిన భారతీయ జనతా పార్టీ.. మరో అంకానికి తెర తీసింది. తొలుత దుబ్బాక ఉప ఎన్నిక, అనంతరం గ్రేటర్ హైదరాబాద్లో సాధించిన విజయంతో కమలనాథులు విజయోత్సాహంతో ఉన్నారు. ఇదే ఊపును నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కొనసాగించడానికి కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వచ్ఛ రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. అవినీతి రహిత రాజకీయాలకు తాము ఆద్యులం అవుతామని ప్రకటించారు.
Recommended Video
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద
అవినీతి రహిత, స్వచ్ఛ రాజకీయాలకు తెర తీస్తామని ప్రకటించడం వరకే ఆగిపోలేదు.. తెలంగాణ బీజేపీ నేతలు. అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ ఉదయం 8:30 గంటలకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజాసింగ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యల ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వచ్ఛ రాజకీయాలు చేస్తామంటూ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.
శుక్రవారం నాడే ప్రమాణం.. అందుకే
హిందు సంప్రదాయాల ప్రకారం శుక్రవారాన్ని పవిత్రంగా భావిస్తారని, అందుకే తమ పార్టీ కార్పొరేటర్లతో అదే రోజు ప్రమాణం చేయించామని బండి సంజయ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తాము భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నామని గుర్తు చేశారు. అమ్మవారి దయతోనే తాము అధిక డివిజన్లను గెలుచుకున్నామని అన్నారు. అయిదేళ్ల పాటు స్వచ్ఛమైన రాజకీయాలు చేసేలా తమకు ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
కేంద్రం నుంచి నిధులను తెప్పిస్తాం..
రాష్ట్రాభివృద్ధిలో తాము రాజీపడబోయేది లేదని బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులను తెప్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కాకపోవడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూర్ఖపు నిర్ణయాలే కారణమని విమర్శించారు. హైదరాబాద్ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదనడానికి మొన్నటి వరదలే సాక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్-ఎంఐఎం కుమ్మక్కై హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకే- హైదరాాబాదీయులు ప్రత్యామ్నాయంగా తమ పార్టీకి ఇదివరకటి కంటే అధిక డివిజన్లను అప్పగించారని అన్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీదే..
భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీదే హైదరాబాద్కు భాగ్యనగరం అని పేరు వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని, అభివృద్ధి దూరంగా ఉందని, దీనికి కారణం అసదుద్దీన్ ఒవైసీయేనని అన్నారు. ఒవైసీ తన రాజకీయాల కోసం ఎవరి వద్దనైనా చేరుతారని విమర్శించారు. ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడితో, ఆ తరువాత కేసీఆర్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలతో కలిసి ఉన్నా.. పాతబస్తీని అభివృద్ధి చేయట్లేదని మండిపడ్డారు.