మైండ్ గేమ్ మొదలెట్టిన ఈటల.. కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్యేలెవరు? పార్టీలోనూ చర్చ!!
హైదరాబాద్: బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా? సీఎం కేసీఆర్ తో మైండ్ గేమ్ మొదలుపెట్టారా? టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకోవడానికి చాప కింద నీరులా పనిచేస్తున్నారా ? రానున్న ఎన్నికల ముందు కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇస్తారా? అంటే తాజా పరిణామాలను బట్టి అవును అన్న సమాధానమే వస్తుంది.
అమిత్ షా డైరెక్షన్ ... ఈటల రాజేందర్ యాక్షన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఈటల రాజేందర్ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో గతంలో భేటీ అయిన సందర్భంలోనే ఆయనకు ప్రత్యేకంగా చేరికలపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కున్న ప్రత్యేకస్థానం నేపథ్యంలో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి, సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, కెసిఆర్ స్వభావం బాగా తెలిసిన వ్యక్తిగా ఈటల రాజేందర్ ఉన్న నేపథ్యంలో, ఆయనను కెసిఆర్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ బాగా వాడుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈటలకు కీలక బాధ్యత అప్పగించింది.
టీఆర్ఎస్ లో అసంతృప్తులకు గాలం వేస్తున్న ఈటల
ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో గులాబీ బాస్ కెసిఆర్ నిర్ణయాలను వ్యతిరేకించే వర్గంతో భేటీ అవుతున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లో ఉద్యమకాలంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులకు, ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం పార్టీ మారామని చెప్పిన నాయకులకు మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఈ పరిణామాలు బాగా తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ కావడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో, కెసిఆర్ నాయకత్వం పై తీవ్ర అసహనం తో ఉన్న నాయకులను గుర్తించి వారిని బిజెపి బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్ దెబ్బకు సిట్టింగ్ లకు టికెట్ భయం.. వారితోనూ టచ్ లోకి ఈటల
అంతేకాదు మరోపక్క కెసిఆర్ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా, వస్తున్న నివేదికలను బట్టి ఈసారి టికెట్ ఇవ్వడం కష్టమని భావించే సిట్టింగ్ లు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. టిఆర్ఎస్ పార్టీ లోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని ప్రతి ఒక్కరు టచ్లో ఉన్నారని ఈటల రాజేందర్ చెప్పడం గులాబీ బాస్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే ఎన్నికలకు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక వారందరిని బిజెపిలో చేర్పించడానికి ఈటల రాజేందర్ మంతనాలు జరుపుతున్నారు.
కేసీఆర్ మైండ్ గేమ్ తెలిసిన ఈటల రివర్స్ మైండ్ గేమ్
అమిత్ షా ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ గా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ చెబుతూ కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఈటల రాజేందర్ కూడా తనదైన శైలిలో మైండ్ గేమ్ మొదలుపెట్టారు. తనతో ప్రస్తుతం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని తాజాగా ఈటల రాజేందర్ పేల్చిన బాంబు టిఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ లో బయటకు వెళ్ళటానికి రెడీ అయిన ఎమ్మెల్యేలు ఎవరు? ఆసక్తికర చర్చ
టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని చూస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు అన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అయితే టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ప్రతి జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో ఉండడంతో బీజేపీ లో చేరడానికి రెడీ అయింది ఎవరు అన్నదానిపై ప్రతి జిల్లాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ రేపిన కలకలం, ఇప్పుడు పార్టీ నుండి బయటకు వెళ్ళే నేతలెవరూ అన్నదానిపై పార్టీ వర్గాల్లో చర్చకు కారణంగా మారింది. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ బాగా తెలిసిన వ్యక్తిగా ఈటల రాజేందర్ కేసీఆర్ తో మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇక పార్టీలో చేరికల విషయానికి వస్తే ఎన్నికలకు ముందు కచ్చితంగా టిఆర్ఎస్ నుండి కీలక నాయకుల చేరికలు ఉంటాయని బిజెపి నేతలు చెబుతున్నారు.