గ్యాంగ్ రేప్ దుమారం.. హోంమంత్రి మనవడికి సంబంధం లేదు, ఎవర్నీ వదలం: కేటీఆర్
హైదరాబాద్ గ్యాంగ్ రేపు ఘటన దుమారం రేపుతోంది. మైనర్ బాలికపై లైంగికదాడి సంచలనం కలిగించింది. ఘటన గురించి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. హోం మంత్రి మనవడు ఉన్నాడనే కోణంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో హోం మంత్రి మనవడు ఎక్కడా కనిపించలేదని డీసీపీ తెలిపారు.
28న ఘటన..
మే 28న గ్యాంగ్ రేప్ జరిగితే... మే 31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారని డీసీపీ చెప్పారు. గ్యాంగ్ రేప్ కారణంగా బాలిక రెండు రోజుల పాటు షాక్లో ఉందని.. అందుకే ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్టు చెప్పారన్నారు. బాలికకు మహిళా కానిస్టేబుళ్లతో కౌన్సిలింగ్ ఇప్పించామని తెలిపారు. ఆ తర్వాత బాధితురాలిని విచారించగా... తనపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పిందన్నారు. వారిలో ఒక్కరి పేరు మాత్రమే బాలిక చెప్పగలిగిందన్నారు.
ఐదుగురు నిందితులు
ఐదుగురు నిందితులను గుర్తించామని డీసీపీ తెలిపారు. వారిలో ఇద్దరు మేజర్లు కాగా, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరో మైనర్ నిందితుడిని అతడి కుటుంబ సభ్యుల కస్టడీలోనే ఉంచామని తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులను 48 గంటల్లోగా అదుపులోకి తీసుకుంటామని డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవని తెలిపారు.
దిగ్బ్రాంతికి గురిచేసింది..
ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను కోరారు. అది అత్యంత హేయమైన ఘటన అని, నిందితులు ఎవరైనా, ఎవరితో సంబంధాలు ఉన్నా సరే ఉపేక్షించరాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
నాకేం తెలియదు
ఆమ్నేషియా పబ్లో జరిగిన గ్యాంగ్ రేప్లో కీలక నిందితుడు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ అని వస్తున్న వార్తలపై స్పందించారు. గ్యాంగ్ రేప్తో ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం రాత్రి ఆయన ప్రకటించారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఆ రోజు ఎవరికీ పార్టీ ఇవ్వలేదన్నారు. పార్టీలో పాల్గొన్న వారు, గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ వారు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.