GHMC Elections 2020:మా సంగతి సరే... అమిత్ షా నిద్రపోతున్నారా..? నిప్పులు చెరిగిన ఓవైసీ
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ మజ్లిస్ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. సోమవారం రోజున నగరంలో బీజేపీ యువనేత బెంగళూరు దక్షిణం ఎంపీ తేజస్వీ సూర్య హైదరాబాదులో పర్యటించి మజ్లిస్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ సూర్య కామెంట్స్కు కౌంటర్ అటాక్ చేశారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
ఓల్డ్ సిటీలో మాటల యుద్ధం
జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.దుబ్బాక ఉపఎన్నిక విజయంతో బీజేపీ మాంచి ఊపుమీద ఉన్నట్లు కనిపిస్తుండగా... కాషాయం పార్టీని గ్రేటర్లో అడుగుపెట్టకుండా ఇటు టీఆర్ఎస్ అటు మజ్లిస్ పార్టీలు తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. సోమవారం రోజున బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీకి వేసే ప్రతి ఓటు భారత్కు వ్యతిరేకంగా వేస్తున్న ఓటుగానే భావించాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓవైసీ సోదరులు రోహింగ్యా ముస్లింలను ఇక్కడ పోషిస్తున్నారని తేజస్వీ సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువ ఎంపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మజ్లిస్ అధినేత ఓవైసీ.
బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోంది
ప్రశాంతంగా ఉంటున్న హైదరాబాదు నగరంలో బీజేపీ మతాల పేరుతో చిచ్చు పెట్టాలని, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఓవైసీ మండిపడ్డారు. ఎన్నికల జాబితాలో 30వేల రోహింగ్యాలు ఉంటే అమిత్ షా ఏం చేస్తున్నారని నిద్రపోతున్నారా అంటూ తేజస్వీ సూర్యను సూటిగా ప్రశ్నించారు ఓవైసీ. 30వేల నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఎన్నికల జాబితాలో ఉంటే దాని గురించి విచారణ చేయాల్సిన బాధ్యత అమిత్ షా పై లేదా అని ప్రశ్నించారు. బీజేపీకి నిజాయితీ ఉంటే మంగళవారం సాయంత్రంలోగా 1000 మంది రోహింగ్యా పేర్లను బయట పెట్టాలంటూ సవా్ విసిరారు.
హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగరం
బీజేపీ ఉద్దేశం హిందువులు ముస్లింల మధ్య గొడవ పెట్టడమే అని ఇక ఈ యుద్ధం హైదరాబాదు భాగ్యనగర్ మధ్య జరుగుతుందని చెప్పారు. ఇక ఎవరిని గెలిపిస్తారో ఓటర్లు నిర్ణయించుకోవాలని అన్నారు ఓవైసీ. అంతకుముందు తేజస్వీ సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓవైసీనీ పాక్ వ్యవస్థాపకులు మొహ్మద్ అలీ జిన్నాతో పోల్చారు. ఇస్లాం, వేర్పాటు వాదం, అతివాదం గురించి ఓవైసీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారని ఇదే భాషను జిన్నా కూడా వినియోగించేవారని తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ తన సోదరుడు అక్బరుద్దీన్లు అభివృద్ధిని అడ్డుకున్నారని తేజస్వీ సూర్య మండిపడ్డారు. కేవలం రోహింగ్యా ముస్లింలను మాత్రమే వారు అనుమతించారనే కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి భారతీయుడు విభజన రాజకీయాలకు మతాలతో ముడిపడి ఉన్న రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఓవైసీ సోదరులకు కూడా దూరంగా ఉండాలని అన్నారు. హైదరాబాదులో మజ్లిస్ పార్టీని గెలిపిస్తే మహారాష్ట్ర, కర్నాటక, బీహార్, ఉత్తర్ ప్రదేశ్లో మజ్లిస్ పార్టీ బలపడుతుందని తేజస్వీ సూర్య అన్నారు.