హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం... పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం...
హైదరాబాద్లో బుధవారం(ఫిబ్రవరి 18) అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నగరంలోని సికింద్రాబాద్,ముషీరాబాద్,రాంనగర్,వారాసిగూడ,లోయర్ ట్యాంక్ బండ్,హిమాయత్ నగర్,రామాంతపూర్,ఎల్బీ నగర్,కొత్తపేట,నాగోలు,బహదూర్పురా, పురానాపూల్, దూద్బౌలి, లంగర్హౌస్, అత్తాపూర్,ఉప్పర్పల్లి, నాంపల్లి, జియాగూడ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్ల పైకి చేరింది.
రాత్రి కురిసిన వర్షానికి నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వాతావరణం చల్లగా మారింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం,ఉపరితల ధ్రోణి ప్రభావంతో నగరంలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాకశముందని తెలిపింది.
గతేడాది సెప్టెంబర్లో భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు 100 ఏళ్ల క్రితం వచ్చిన మూసీ వరదలను గుర్తుచేశాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోగా... దాదాపు 30 మంది వరదల్లో గల్లంతయ్యారు. చాలాచోట్ల ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడంతో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అసలే కరోనా కష్టాలతో విలవిల్లాడుతున్న జనానికి ఈ వరదలు మరిన్ని కష్టాలు తీసుకొచ్చాయి. చాలా ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించి ఇంటి సామాగ్రి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాధితులకు ఇంటికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాయం అందరికీ అందలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.