వచ్చే 72 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు: ఆ భవనాలకు నోటీసులంటూ కేటీఆర్
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని, ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శిథిల భవనాల్లో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు.

72 గంటలపాటు అతి భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం రాబోయే 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని చోట్ల అతి భారీగా -16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
భారీ వర్షాల వల్ల ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, ఇతర వసతులను సురక్షిత కేంద్రాలుగా ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications